స్పీడ్ అంటే ఈ హీరోదే..

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి టాలీవుడ్ తొలి తరం సూపర్ స్టార్లు అలవోకగా వందల సినిమాల్లో నటించారు. ఆ తర్వాతి తరం టాప్ స్టార్లలో చిరంజీవి 150 సినిమాల మార్కును అందుకుంటే బాలయ్య వంద దాటేశాడు. నాగ్ వందకు చేరువ అవుతుంటే.. వెంకీ 75వ సినిమా చేస్తున్నాడు. కానీ ఆ తర్వాతి తరం స్టార్ హీరోలు మాత్రం కెరీర్ మొత్తంలో 50 సినిమాలు చేయడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. వీళ్లంతా కూడా ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా గగనంగానే ఉంది.

తమిళంలో కూడా విజయ్, అజిత్, సూర్య లాంటి టాప్ స్టార్లు నెమ్మదిగానే సినిమాలు చేస్తుంటారు. ఐతే కోలీవుడ్‌ టాప్ స్టార్లలో ఒకడైన ధనుష్‌ది మాత్రం సూపర్ స్పీడే. సొంతంగా స్టార్ హీరోగా ఎదిగిన ధనుష్.. ఎప్పుడూ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోలేదు. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో తమిళంలోనే కాక హిందీలోనూ సినిమాలు చేశాడు. ‘సార్’తో టాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

చాలామంది స్టార్ హీరోలతో పోలిస్తే ధనుష్ సక్సెస్ రేట్ ఎక్కువ. అతడి సినిమాల్లో ఎంతో వైవిధ్యం ఉంటుంది. అదే సమయంలో అప్పుడప్పడూ మాస్ సినిమాలు కూడా చేసి మెప్పిస్తుంటాడు. సినిమాకు సినిమాకు గ్యాప్ తీసుకోడు. ఏడాదిలో కనీసం రెండు రిలీజ్‌లు ఉండేలా చూసుకుంటాడు. అలా అని క్వాలిటీ విషయంలో రాజీ పడడు. 2002లో ‘తుల్లువదో ఎలమై’ అనే చిన్న సినిమాతో నటుడిగా పరిచయం అయిన ధనుష్.. అప్పుడే 50 సినిమాల మైలురాయిని చేరుకోవడం విశేషం.

ఈ మైల్ స్టోన్ మూవీని స్వీయ దర్శకత్వంలో అతను రూపొందించబోతున్నాడు. సన్ పిక్చర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది. దీని ప్రి లుక్ పోస్టర్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ధనుష్ 25వ సినిమా ‘వేల ఇల్ల పట్టదారి’ (వీఐపీ) రిలీజైంది 2014లో. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దాని తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘రఘువరన్ బీటెక్’ తెలుగులో ధనుష్‌కు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇంకో తొమ్మిదేళ్లకే అతను 50 సినిమాల మైలురాయిని అందుకోవడం విశేషం. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ ఏడాది ఆఖర్లో ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.