రుద్రంగి ఎలా ఉందంటే

నిన్న చాలా సినిమాలు వచ్చాయి కానీ జనం దృష్టిలో ఎక్కువగా పడింది రంగబలి ఆ తర్వాత భాగ్ సాలే. వాటి రిపోర్ట్స్, రివ్యూలు ఆల్రెడీ బయటికి వచ్చేశాయి. ఆ తర్వాత ఉన్న వాటిలో మాస్ ఓ లుక్ వేద్దామనుకున్నది రుద్రంగి. జగపతిబాబు ప్రధాన పాత్రలో అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాకు రసమయి బాలకిషన్ నిర్మాత. బాలకృష్ణ అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడంతో బజ్ వచ్చింది. పెద్దగా అంచనాలు లేకపోయినా ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమోనని ఆశించిన పబ్లిక్ లేకపోలేదు. మరి చెప్పుకునేలా రుద్రంగిలో ఏమైనా విషయం ఉందా

దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో కొన్ని తెలంగాణ పల్లెలకు ఆ విషయం కూడా తెలియనంతగా పెత్తందారీతనం చేస్తుంటారు దొరలు. అందులో ఒకడు భీంరావ్ దేశముఖ్(జగపతిబాబు). వయసు మళ్ళిన తరువాత కూడా మూడో పెళ్ళాంగా జ్వాలా(మమతా మోహన్ దాస్)ని తెచ్చుకుంటాడు. ఇతని దగ్గర నమ్మిన బంటు మల్లేష్(అశ్విన్ గాంధీ). ఓసారి దొర వేటకు అడవికి వెళ్ళినప్పుడు మల్లేష్ మరదలు రుద్రంగి(గనవి లక్ష్మణ్)మీద కన్నుపడి ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటాడు. దీంతో రాజు బంటు మధ్య శత్రుత్వం మొదలవుతుంది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.

దశాబ్దాల నాటి దొరల అరాచకాలను చూపించాలని ప్రయత్నం చేసిన అజయ్ సామ్రాట్ దానికి తగ్గ బలమైన కథా కథనాలు సమకూర్చుకోలేదు. భీంరావ్ కామంతో రగిలిపోవడం తప్ప ప్రత్యేకంగా కాంఫ్లిక్ట్ పాయింట్ అంటూ ఏదీ లేదు. రెండు మూడు ట్విస్టులతో ఫస్ట్ హాఫ్ నెట్టుకొచ్చినా ఇంటర్వెల్ తర్వాత పూర్తిగా నెమ్మదించిపోయి క్లైమాక్స్ చప్పగా ముగిసిపోయి రుద్రంగి  ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. నటనపరంగా అశ్విన్ గాంధీ మైనస్ అయ్యాడు. జగపతిబాబు, మమతామోహన్ దాస్ లు మాత్రమే అంతో ఇంతో నిలబెట్టారు. ఉద్వేగం కలిగించే ఎపిసోడ్లు, సరైన ఎమోషన్లు లేకపోవడం మైనస్. నోఫెల్ సంగీతం ఓకే.