అర్జున్ పైరసీ గొడవ ఇప్పుడెందుకు  

అవసరం లేని గతాన్ని తవ్వడం వల్ల ఎవరికీ  ఉపయోగం ఉండదు. లేదూ ఏదైనా ప్రయోజనం ఉంటుందంటే ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. సీనియర్ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ ఈ మధ్య కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గురించి చేసిన కామెంట్స్ బాగానే రచ్చ చేశాయి. తాజాగా ఎప్పుడో జరిగిన సంఘటనని దేనికో ముడిపెట్టబోయి సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నారు. ఇటీవలే  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు పరిశ్రమకు సంబంధించిన ఇష్యూస్ లో ఎందుకు కనిపించరన్న ప్రశ్నకు ఓ వింత సమాధానం ఇచ్చారు.

2004లో అర్జున్ సినిమా పైరసీకి గురైనప్పుడు మహేష్ స్వయంగా దాన్ని పట్టుకున్నా సరే ఎవరూ అండగా నిలబడలేదని, పవన్ మాట అన్నారు కానీ వచ్చారో లేదో గుర్తు లేదని సెలవిచ్చారు. ఇంత నిస్సహాయతను అనుభవించాడు కాబట్టే అప్పటి నుంచి మహేష్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నారని అన్నారు. నిజానికి అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు సుమంత్, సురేష్ బాబు, నాగబాబు, అశ్వినీదత్, బూరుగుపల్లి శివరామకృష్ణ, నటుడు అశోక్ కుమార్ తదితరులంతా ప్రెస్ మీట్ లో పాల్గొని మరీ సంఘీభావం తెలిపారు. ఆ ఫోటో కూడా ఫ్యాన్స్ బయటికి తీశారు.

అదంతా మర్చిపోయి మహేష్ సినిమాకు అన్యాయం జరిగినప్పుడు ఇండస్ట్రీలో ఏ మగాడు బయటికి రాలేదనే రీతిలో తమ్మారెడ్డి మాట్లాడ్డం విమర్శలకు దారి తీసింది. ఆ మాటకొస్తే అత్తారింటికి దారేది రిలీజ్ కు ముందే ఆన్ లైన్ హెచ్డి ప్రింట్ వచ్చినప్పుడు ఎవరేం చేయలేకపోయారు. బాహుబలిని ఎక్కడో మహారాష్ట్రలో పైరసీ చేస్తే అక్కడిదాకా వెళ్లిన రాజమౌళి, అల్లుఅరవింద్ థియేటర్ ని సీజ్ చేయించగలిగారు కానీ తర్వాత ఆ భూతాన్ని ఆపలేదు. ఇది నిరంతర సమస్య. ఇప్పుడూ ఉంది. ఏదో ఫ్లో వెళ్ళిపోతోందని పెద్దాయన అనేశారు కానీ అభిమానులు ఎందుకు ఊరుకుంటారు. కౌంటర్లు ఇచ్చేశారు