బన్నీ-త్రివిక్రమ్.. సోషియో ఫాంటసీ?

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో కొత్త సినిమాకు రంగం సిద్ధమైంది. కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. కొన్ని వారాల ముందే సినిమాను ప్రకటించాలని అనుకున్నా.. అప్పటికి మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమాకు సంబంధించి నెగెటివ్ విషయాలు హల్‌చల్ చేస్తుండటంతో.. అది సరైన టైమింగ్ కాదని ఊరుకున్నారు.

‘గుంటూరు కారం’కు సంబంధించి సమస్యలన్నీ సద్దుమణిగి ఇప్పుడు సాఫీగా షూటింగ్ సాగిపోతుండటంతో బన్నీతో మాటల మాంత్రికుడి నాలుగో సినిమా గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. ఇప్పటికే వీరి కలయికలో ‘జులాయి’ లాంటి సూపర్ హిట్, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లాంటి ఎబోవ్ యావరేజ్, ‘అల వైకుంఠపురములో’ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ వచ్చాయి. ఈసారి వాళ్లిద్దరూ కలిసి చేసే సినిమా వేరే లెవెల్లో ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ అంచనాలకు తగ్గట్లే.. ఏదో పెద్దగా చేయబోతున్న సంకేతాలను అనౌన్స్‌మెంట్ వీడియోలో ఇచ్చారు. ఇక చిత్ర వర్గాల సమాచారం ఇదొక సోషియో ఫాంటసీ సినిమా అట. దీని బడ్జెట్ వందల కోట్లలో ఉంటుందట. ఈ సినిమా స్కేల్ దృష్ట్యా ఖర్చు రూ.500 కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదట. ఇంత వరకు బన్నీ కానీ, త్రివిక్రమ్ కానీ ఇలాంటి భారీ చిత్రం ఏదీ చేయలేదు. గతంలో బన్నీ ‘బద్రీ నాథ్’ లాంటి భారీ చిత్రం చేసినా అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత అతను సేఫ్ గేమ్సే ఆడుతున్నాడు. త్రివిక్రమ్ తన మార్కును ఫ్యామిలీ ఎంటర్టైనర్లే తీస్తున్నాడు.

ఐతే చరిత్ర మీద, పురాణాల మీద గొప్ప పట్టు ఉండి కూడా పొటెన్షియల్‌ను త్రివిక్రమ్ సరిగా వాడుకోవట్లేదని.. రాజమౌళిలా భారీ చిత్రాలు చేయట్లేదని ఆయన అభిమానుల్లో అసంతృప్తి ఉంది. త్రివిక్రమ్ పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎందుకు ఎదగలేడనే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వాటికి సమాధానమే బన్నీతో చేయబోయే సినిమా అంటున్నారు. దీని కథ, కాన్వాస్ అన్నీ పెద్దవే. సోషియో ఫాంటసీ అనగానే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా సినిమాను ఆశిస్తారు అభిమానులు. మరి త్రివిక్రమ్ కంఫర్ట్ జోన్‌ నుంచి బయటికి వచ్చి అలాంటి సినిమానే తీసి మెప్పిస్తే బాక్సాఫీస్ ఊగిపోవడం ఖాయం.