యానిమల్ అయోమయం తీరిపోయింది

బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందుతున్న అనిమల్ విడుదల తేదీ విషయంలో  సందిగ్దత తీరిపోయింది. ఆగస్ట్ 11 ఖచ్చితంగా వస్తుందని మొన్నటిదాకా చెబుతూ వచ్చిన నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ వర్గాలకు వాయిదా సమాచారాన్ని అధికారికంగా ఇచ్చేశాయట. బిజినెస్ డీల్స్ జరుగుతున్నప్పటికీ రిలీజ్ డేట్ కు సంబంధించి వ్యవహారాన్ని నాన్చుతూ వచ్చి ఫైనల్ గా తేల్చేశారు. ఇటీవలే ఒక చిన్న ప్రీ టీజర్ తప్ప ఎలాంటి ప్రమోషన్ జరగలేదు. షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతోంది .

అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు యానిమల్ కు సంబందించిన చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. అందుకే డిసెంబర్ మొదటి వారానికి వెళ్లాలని ప్రాధమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నా సరే విపరీతమైన పోటీలో దిగడం వల్ల సౌత్ మార్కెట్లలో దెబ్బ పడే ప్రమాదం ఉంది. తమిళంలో రజనీకాంత్, తెలుగు చిరంజీవిలు ఢీ కొట్టడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళను తక్కువంచనా వేయడానికి లేదు. మాస్ మార్కెట్లను ప్రభావితం చేస్తారు. పైగా అటు హిందీలోనూ గదర్ ఏక్ ప్రేమ్ కథ 2 రూపంలో కాంపిటీషన్ ఉంది.

దీంతో రిస్క్ ఎందుకు లెమ్మని డెసిషన్ మార్చుకుని ఉండొచ్చు. ఎందుకంటే చేతిలో పెద్దగా టైం లేదు. కేవలం నలభై రోజుల్లో పబ్లిసిటీతో పాటు ఇండియా వైడ్ బజ్ వచ్చేలా హంగామా చేయాలి. యానిమల్ ఆల్ టైం టాప్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలుస్తుందని ఇప్పటికే  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రన్బీర్ కపూర్ పాత్రని చాలా అగ్రెసివ్ గా డిజైన్ చేశారని, ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని గ్యాంగ్ స్టర్ డ్రామాని ఆవిష్కరించబోతున్నట్టు సమాచారం. మరి అలాంటప్పుడు సోలోగా వస్తేనే అడ్వాంటేజ్ దక్కుతుంది. అందుకే ఫైనల్ గా పోస్ట్ పోన్ వార్తని అఫీషియల్ చేయబోతున్నారు.