గ్రూప్-4 ప‌రీక్ష‌లో బ‌ల‌గం గురించి ప్ర‌శ్న‌

గ‌త కొన్నేళ్ల‌లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌ర్ప్రైజ్ హిట్ అంటే బ‌ల‌గం అనే చెప్పాలి. కమెడియ‌న్ వేణు యెల్దండి రూపొందించిన ఈ చిత్రం విమ‌ర్శ‌ల ప్ర‌శంస‌లు అందుకోవ‌డంతో పాటు మంచి వ‌సూళ్లు కూడా సాధించింది. తెలంగాణ సంస్కృతి, గ్రామీణ జీవ‌నాన్ని క‌ళ్ల‌కు క‌ట్టేలా చూపించి.. వినోదంలో ముంచెత్తి.. ఎమోష‌న్ల‌లో త‌డిసి ముద్ద‌య్యేలా చేసిన చిత్ర‌మిది.

తెలంగాణ వాసుల‌నే  కాక తెలుగు ప్రేక్ష‌కులంద‌రినీ కూడా ఈ సినిమా ఆక‌ట్టుకుంది. గ్రామాల్లో తెర‌లు క‌ట్టి ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించారంటే అదెంత సంచ‌ల‌నం రేపిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఈ సినిమాకు మరో గౌర‌వం ద‌క్కింది. శ‌నివారం తెలంగాణ‌లో నిర్వ‌హించిన గ్రూప్-4 ప‌రీక్ష‌లో బ‌ల‌గం సినిమాకు సంబంధించి ఒక ప్ర‌శ్న వేయ‌డం విశేషం.

బ‌లగం సినిమాకు సంబంధించి ఈ కింద జ‌త చేసిన వివ‌రాల్లో ఏది స‌రైంది అని ప్ర‌శ్న అడ‌గ్గా.. కింద స‌మాధానాల్లో ద‌ర్శ‌కుడు- వేణు యెల్దండి, నిర్మాత- దిల్ రాజు, హ‌ర్షితా రెడ్డి, హ‌ర్షిత్ రెడ్డి.. సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ సిసిరోలియో.. కొమ‌ర‌య్య పాత్ర‌ను పోషించిన‌వారు- అరుసం మ‌ధుసూద‌న్ అనే ఆప్ష‌న్లు ఇచ్చారు. ఇందులో తొలి మూడు స‌రైన ఎంపిక‌లు కాగా.. చివ‌రిది త‌ప్పు.

ఇందులో కొమ‌ర‌య్య పాత్ర చేసిన న‌టుడి పేరు సుధాక‌ర్ రెడ్డి పోషించారు. దీని మీద ఆప్ష‌న్లు ఇచ్చి ప్ర‌శ్న అడిగారు. త‌మ సినిమా గురించి గ్రూప్స్ ప‌రీక్ష‌ల్లో ప్ర‌శ్న అడ‌గ‌డం ప‌ట్ల చిత్ర బృందం అమితానందాన్ని వ్య‌క్తం చేసింది. ద‌ర్శ‌కుడు వేణు ఈ విష‌యాన్ని సోస‌ల్ మీడియాలో షేర్ చేసి ఇది త‌మ‌కు ద‌క్కిన గౌర‌వ‌మ‌ని పేర్కొన్నాడు. తెలంగాణ సంస్కృతికి అద్దం ప‌ట్టిన సినిమాను ఇలా గౌర‌వించ‌డం మంచి విష‌య‌మ‌ని హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.