నిఖిల్ స్టామినాని వాడుకోవడం తెలియాలి

నిన్న రిలీజైన స్పైకు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. టాక్స్, రివ్యూస్ ఎలా ఉన్నా బక్రీద్ సెలవును పూర్తిగా వాడుకుంది ఒక్క నిఖిల్ మాత్రమే. మొదటి రోజు 11 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంటే షేర్ ఏడు కోట్ల దాకా తేలుతుంది. ముప్పై శాతానికి పైగా రికవరీ ఫస్ట్ డేనే జరిగిపోయింది. అయితే ఈ జోరు మొదటి వీకెండ్ మొత్తం కొనసాగిస్తేనే బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ ఇవాళ్టి నుంచే లెక్కలో తగ్గుదల కనిపిస్తోంది. బిసి సెంటర్స్ లో డ్రాప్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందంటున్నారు. బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా తేలాలంటే ఈ ఆదివారం గడవాలి.

కాసేపు ఈ కలెక్షన్లు పక్కనపెడితే నిఖిల్ మార్కెట్ స్టామినా ఎంత పెరిగిందో స్పై చూపించింది. కంటెంట్ ఎలా ఉందో పక్కాగా తెలియక ముందే ఆడియన్స్ తన సినిమా చూసేందుకు రెడీ అవుతున్నారు. పాజిటివ్ టాక్ వచ్చిన సామజవరగమనకు ఈ స్థాయిలో రెస్పాన్స్ కనిపించడం లేదు. పికప్ స్లోగా ఉంది. మల్టీప్లెక్సుల షోలు మెల్లగా ఫుల్ అవుతున్నాయి. ఒకవేళ స్పై కనక యునానిమస్ గా బాగుందని పబ్లిక్ టాక్ తెచ్చుకుని ఉంటే దాదాపు అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు తీయాల్సిన పనుండేది కాదు. కానీ పరిస్థితులు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు

ఇకపై నిఖిల్ మరింత జాగ్రత్తగా ఉండాలి. రామ్ చరణ్ నిర్మాతగా ఇండియా హౌస్ , చరిత్రాత్మక బ్యాక్ డ్రాప్ తో స్వయంభు లాంటి ప్రాజెక్టులు కుర్ర హీరోలకు అంత సులభంగా వచ్చేవి కాదు. కార్తికేయ 2 తాలూకు సక్సెస్ ప్రభావం ఆ స్థాయిలో నిలిచింది కాబట్టే మధ్యలో వచ్చిన 18 పేజెస్ యావరేజ్ అయిన సంగతిని కనీసం ఎవరూ గుర్తించుకోలేదు. మినిమమ్ గ్యారెంటీ స్టేజిని ఎప్పుడో దాటేసిన నిఖిల్ ఇకపై తనమీద పెరుగుతున్న బడ్జెట్ లను దృష్టిలో పెట్టుకోవాలి. ఆ శ్రద్ధ ఉంది కాబట్టే ఆ మధ్య గ్యాప్ తీసుకోవాల్సి వచ్చినా భయపడలేదు. ఈ ప్లానింగ్ ఇకపై కూడా కొనసాగాలి