ట్రోల్ పేజీల పుణ్యం.. సినిమా హిట్టు

ఈ రోజుల్లో యంగ్ హీరోల సినిమాలకే బజ్ తీసుకురావడం కష్టం అవుతోంది. అలాంటిది మూడు దశాబ్దాల కిందటే హీరో వేషాలు వదిలేసి క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సీనియర్ నటుడు నరేష్ లీడ్ రోల్ చేసిన సినిమాను ప్రేక్షకులు పట్టించుకుంటారని ఎవరూ అనుకోలేదు. కానీ ఎం.ఎస్.రాజుతో కలిసి ఆయన తన నిజ జీవిత కథతోనే చేసిన ‘మళ్ళీ పెళ్ళి’ ఓ రిలీజ్ ముంగిట బాగానే బజ్ తెచ్చుకుంది.

నరేష్ సినిమాకు తొలి రోజు ఓ మోస్తరుగా అయినా థియేటర్లలో జనాలు ఉన్నారంటే.. ఆయన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పవిత్ర లోకేష్‌తో రిలేషన్ మీద ఉన్న ఆసక్తి.. ఆ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాల వల్లే. ఐతే ‘మళ్ళీ పెళ్ళి’ మరీ ఏకపక్షంగా.. ప్రాపగండా ఫిలిం లాగా ఉండటం.. డ్రామా రక్తి కట్టకపోవడంతో ప్రేక్షకుల నుంచి తిరస్కారం తప్పలేదు. ఈ సినిమాను థియేటర్లకు వెళ్లి చూడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం చూసిన వాళ్లలో వ్యక్తమైంది.

థియేటర్ల నుంచి త్వరగానే అంతర్ధానం అయిపోయిన ‘మళ్ళీ పెళ్ళి’ ఇప్పుడు ఆహా ఓటీటీ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే రిలీజ్ దగ్గర్నుంచి ఈ సినిమా ఆహా టాప్-10లో ట్రెండ్ అవుతోంది. జనం ఓటీటీలో ఈ సినిమాను బాగానే చూస్తున్నారని అర్థమవుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా టాపిక్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అందుక్కారణం ట్రోల్ పేజీలే అని చెప్పాలి. నరేష్, పవిత్రల మీద కౌంటర్లు వేస్తూ..  సినిమాలోని సన్నివేశాలను ట్రోల్ చేస్తూ బోలెడన్ని మీమ్స్, జోకులు తయారు చేసి వదులుతున్నారు.

జయసుధను నరేష్ మమ్మీ అనే సన్నివేశం.. పవిత్రకు కన్నుగొట్టడం నేర్పించే సీన్.. తన మాజీ భార్యతో వాదోపవాదాలకు సంబంధించిన సీన్లు.. అలాగే పవిత్ర పార్ట్‌నర్‌కు వార్నింగ్ ఇచ్చే సన్నివేశం.. ఇలాంటివి సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు బాగా పనికి వస్తున్నాయి. ఐతే తనను ఎంత ట్రోల్ చేసినా.. సినిమా జనాల దృష్టిలో పడితే చాలనే నరేష్ ముందు నుంచి భావిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆయన ఫీలయ్యేదేమీ లేదు. సినిమా డిజిటల్ రిలీజ్ దగ్గర్నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం.. ఆహాలో మంచి రెస్పాన్స్ వస్తుండటం పట్ల నరేష్ హ్యాపీగానే ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.