తారక్ అభిమానికి న్యాయం కోసం ముక్తకంఠం

ఒక స్టార్ హీరో అభిమాని మరణిస్తే ట్రెండింగ్ టాపిక్ కావడం అరుదు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉన్న శ్యామ్ నిన్న అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా అతని మృతదేహం మీదున్న గాయాలు, ఉరి వేసుకున్న చోట్ల కాళ్ళు నేలకు తాకడం లాంటివి ఉదహరిస్తూ దీని వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ పూర్తి స్థాయిల విచారణ చేయాలనీ తారక్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇది మెల్లగా అందరూ హీరోల ఫాలోయర్స్ మద్దతుని కూడబెట్టుకుంటోంది ట్విట్టర్ లో పెద్ద చర్చకు దారి తీసింది.

వివరాల్లోకి వెళ్తే శ్యామ్ ది తూర్పుగోదావరి జిల్లా చింతలూరు. జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన ఇష్టం. విశ్వక్ సేన్ దాస్ కి ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దేవుడిలా భావించే హీరో అతిధిగా రావడంతో ఆనందం తట్టుకోలేక ఏకంగా స్టేజిపైకి వెళ్ళాడు. పక్కనున్న వాళ్ళు తోసేయబోతున్నా తారక్ నిలువరించి మరీ ఫోటో దిగాడు. ఇది వైరల్ అయ్యింది. ట్విట్టర్ వేదికగా శ్యామ్ సినిమాల రికార్డులు, కలెక్షన్లు, సెంటర్లు, సామజిక కార్యక్రమాలు అన్నింటిలో చురుకుగా సమాచారం ఇచ్చేవాడని స్నేహితులు అంటున్నారు. అలాంటి వ్యక్తి ఇలా చనిపోవడమే జీరించుకోలేకపోతున్నారు  

శ్యామ్ కు న్యాయం జరగాలని ఇతర హీరోల అభిమాన సంఘాలతో పాటు చంద్రబాబునాయుడు, నారా లోకేష్, నిఖిల్, నిర్మాత ఎస్కెఎన్, టాలీవుడ్ పిఆర్ఓలు ముక్త కంఠంతో వీ స్టాండ్ విత్ శ్యామ్ అంటూ విచారణ  కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా దర్యాప్తు ప్రాధమిక దశలోనే ఉందని సమాచారం. అయినా చదువు, వృత్తి పరంగా ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేని శ్యామ్ వెనుక ఏదో కుట్ర జరిగిదంటున్న ఫ్యాన్స్ అంటున్న మాటల్లో నిజానిజాలు నిగ్గుతేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి