మ‌హేష్‌-రాజ‌మౌళి.. ఎగ్జైటింగ్ అప్‌డేట్

మ‌హేష్ బాబు కెరీర్లో ఇప్ప‌టిదాకా చేసిన సినిమాల‌న్నీ ఒకెత్త‌యితే.. రాజ‌మౌళితో చేయ‌బోయే చిత్రం మ‌రో ఎత్తు అవుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. పుష్క‌రం కింద‌టే వీళ్లిద్ద‌రూ క‌లిసి సినిమా చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ కుద‌ర‌లేదు. ఐతే ఈ ఆల‌స్యం కూడా మంచికే అయింది. ఇప్పుడు దేశంలోనే నంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడిగా ఎదిగి.. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌తో ప్ర‌పంచ స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ఉర్రూతూల‌గించిన స‌మ‌యంలో రాజ‌మౌళితో సినిమా చేయ‌బోతుండ‌టం మ‌హేష్ అదృష్టం అనే చెప్పాలి.

ఈ సినిమా కోసం కొన్ని నెల‌ల నుంచి క‌థ త‌యారీ ప‌ని న‌డుస్తోంది. ఎప్ప‌ట్లాగే రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ దీనికి క‌థ అందిస్తున్నారు. ఈ చిత్రం ఇండియానా జోన్స్ త‌ర‌హా అడ్వెంచ‌ర‌స్ ఫిలిం అని రాజ‌మౌళి ఇప్ప‌టికే సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడు విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఒక ఇంట‌ర్వ్యూలో క‌థ గురించి మ‌రికొన్ని విశేషాలు చెప్పారు. మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాలో ఇండియానా జోన్స్‌తో పాటు మ‌రో చిత్రం ఛాయ‌లు కూడా ఉంటాయ‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ చెప్పారు.

ఆ చిత్ర‌మే.. 1981లో విడుద‌లైన రైడ‌ర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్. ఇది కూడా అడ్వెంచ‌ర‌స్ ఫిలిమే. దీన్ని లెజెండ‌రీ డైరెక్ట‌ర్ స్టీఫెన్ స్పీల్‌బ‌ర్గ్ తీశాడు. ఇక త‌మ స్క్రిప్టు ప‌నులు జులైక‌ల్లా పూర్త‌వుతాయ‌ని వెల్ల‌డించిన విజ‌యేంద్ర‌.. ఈ చిత్రంలో థ్రిల్‌తో పాటు బోలెడంత ఎమోష‌న్ కూడా ఉంటుంద‌ని చెప్పారు. ఈ సినిమా క‌థ‌ను ముగించ‌కుండా.. క్లైమాక్స్‌ను ఓపెన్‌గా వ‌దిలేస్తున్నామ‌ని.. సీక్వెల్‌కు స్కోప్ ఉంటుంద‌ని విజ‌యేంద్ర చెప్ప‌డం విశేషం. దీన్ని బ‌ట్టి మ‌హేష్‌, రాజ‌మౌళి మ‌ళ్లీ క‌లిసి సినిమా చేయొచ్చ‌న్న‌మాట‌. ఈ చిత్రానికి మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 9న ప్రారంభోత్స‌వ వేడుక చేస్తార‌ని అంటున్నారు. షూటింగ్ వ‌చ్చే ఏడాదే మొద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది. స్క్రిప్టు లాక్ అయ్యాక ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు ఆరు నెల‌ల‌కు పైగానే స‌మ‌యం ప‌ట్టొచ్చు.