వర్మ వ్యూహం ఒకవైపే అనుకూలం

ఒకప్పుడు కల్ట్ డైరెక్టర్ గా ఎందరినో ప్రభావితం చేసి గొప్ప దర్శకులను ఇండస్ట్రీకి ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడెలాంటి కంటెంట్ తీస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయంగా పూర్తిగా వైఎస్ఆర్సిపి స్టాండ్ తో చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసుకుని విమర్శించడం, వ్యంగ్యంగా ఎద్దేవా చేయడమే ట్విట్టర్ లో పనిగా పెట్టుకున్న వర్మ తాజాగా వ్యూహంతో రాబోతున్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయే సమయానికి జరిగిన రాజకీయ పరిణామాలు, జగన్ కుటుంబంలో రేగిన అలజడి ప్రధానాంశాలుగా దీన్ని రూపొందించారు. ఇందాక ట్రైలర్ వచ్చింది

వైఎస్ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించాక, ఆ ఫ్యామిలీలో వచ్చిన స్పందనలు, అపోజిషన్ పార్టీలో వచ్చిన రియాక్షన్లు ఎక్కువగా హైలైట్ చేశారు. రంగం ఫేమ్ అజ్మల్ జగన్ పాత్రలో కనిపించగా రోశయ్య, భారతి, కిరణ్ కుమార్ రెడ్డి తదితర క్యారెక్టర్లకు తగ్గ నటీనటులనే సెట్ చేసుకున్నారు. ఎలాంటి సంభాషణలు లేకుండా కేవలం సౌండ్ తోనే రెండున్నర నిమిషాల వీడియోను కట్ చేయడం విశేషం. పూర్తిగా వన్ సైడ్ పొలిటికల్ అజెండాతో ఈ వ్యూహం రూపొందినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని సీన్లు మిస్ లీడ్ చేసినట్టు అనిపించినా వర్మ వైసిపికి వ్యతిరేకంగా తీసే ప్రసక్తే ఉండదు.  

ఇటీవలే తాడేపల్లిగూడెం సీఎం ఆఫీస్ కు వెళ్లి మరీ వర్మ జగన్ ను కలవడంలో ఉద్దేశం ఈ ట్రైలర్ చూపించి ఆశీర్వాదం తీసుకోవడానికేనని ఇన్ సైడ్ టాక్. ఎక్కడ ఏ ఇంటర్వ్యూ చూసినా వైసిపి వీర విధేయుడిగా మాట్లాడుతున్న వర్మ చాలా నేర్పుగా సంతకాల సేకరణ లాంటి వివాదాస్పద అంశాల జోలికి పోయినట్టు కనిపించడం లేదు. ఎన్నికలు మరికొద్ది నెలల్లో ఉన్నాయనగా వర్మ ఇప్పుడీ వ్యూహం తీయడం, మహి వి రాఘవ్ యాత్ర 2కి సన్నాహాలు చేసుకోవడం అంతా ప్రీ ప్లాన్డ్ గా కనిపిస్తోంది. టైటిల్ కు తగ్గట్టు ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమంటే కాదని ఎవరంటారు