దేశ భద్రత కోసం తెగించే ‘స్పై’

చాలా హడావిడితో ప్రమోషన్లకు తగినంత టైం లేకపోయినా ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం విడుదల తేదీని మార్చుకోకుండా వస్తున్న స్పై  వచ్చే వారం 29 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది. వాస్తవానికి ఉదయం అల్లు అర్జున్ ఏఏఏ మల్టీప్లెక్సులో ఈవెంట్ ప్లాన్ చేశారు కానీ చివరి నిమిషంలో సాయంత్రానికి వాయిదా వేశారు. ఏదో సాంకేతిక కారణాల వల్ల పోస్ట్ పోన్ తప్పలేదు. ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద టీజర్ నాటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. మరి తక్కువ టైంలో హైప్ ని టార్గెట్ చేసుకున్న ట్రైలర్ లో ఏముందంటే.  

భారతదేశం వెతుకుతున్న టెర్రరిస్టు ఖాదర్(నితిన్ మెహతా) విదేశాల్లో తలదాచుకున్నాడని తెలుసుకున్న ప్రభుత్వం అతన్ని పట్టుకొచ్చే బాధ్యతను ఓ కీలక అధికారి(మకరంద్ దేశ్ పాండే)చేతిలో పెడుతుంది. తన అన్నయ్య(ఆర్యన్ రాజేష్)చావుకు దీంతో సంబంధం ఉందని గుర్తించిన యువకుడు(నిఖిల్) గూఢచారిగా ఈ రహస్యం చేధించేందుకు రెడీ అవుతాడు. అయితే అనూహ్యంగా సుభాష్ చంద్ర బోస్ తాలూకు ఒక గొప్ప నిజాన్ని బయటపెట్టే అవకాశం దక్కుతుంది. ప్రాణాలు రిస్క్ లో పడతాయి. వీటిని దాటుకుని తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడమే స్పై కాన్సెప్ట్

విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. ఫ్రేమ్స్ లో క్వాలిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. లొకేషన్లలో రిచ్ నెస్ తో పాటు ఇలాంటివి తీయడంలో బాగా పేరున్న బాలీవుడ్ కి ఛాలెంజ్ చేసే రేంజ్ లో స్టోరీ గట్రా ఆసక్తికరంగా ఉన్నాయి. ఐశ్వర్య మీనన్, సాన్యా ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. అభినవ్ గోమటంకు సీరియస్ పాత్ర దక్కింది. వంశీ-డేవిడ్ ఛాయాగ్రహణం, శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం మంచి ఎలివేషన్ కు దోహదపడ్డాయి. ప్యాన్ ఇండియా రేంజ్ కు కావాల్సిన కంటెంట్ పుష్కలంగా ఉందనే ఇంప్రెషనైతే ఇచ్చారు. సినిమా కూడా ఇలాగే ఉంటే నిఖిల్ జేబులో మరో హిట్టు పడ్డట్టే.