ఫ్యాన్స్ ఆలోచనలు మార్చేసిన పవన్

నిన్న వారాహి యాత్రలో అందరూ హీరోలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా తన కంటే మహేష్ బాబు, ప్రభాస్ లే పెద్ద హీరోలని, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారని, తారక్ చరణ్ లు గ్లోబల్ స్టార్లు అయ్యారని, ఇది ఒప్పుకోవడానికి తనకు ఎలాంటి ఈగో లేదని చెప్పడం అందరి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన దక్కించుకుంది. ఆ వీడియోని సదరు అభిమాన సంఘాల అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసుకుని పవన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పడం వైరల్ అవుతోంది.

ఒకరకంగా చెప్పాలంటే పవన్ చాలా క్యాలికులేటెడ్ గా ప్రాక్టికల్ గా అన్న మాటలు అందరి ఫ్యాన్స్ ని ఆలోచనలో పడేసిన మాట వాస్తవం. ఎంతసేపూ హీరోల గురించి గొప్పలు చెప్పుకుంటూ కలెక్షన్ల మీద బురద జల్లడం, ట్రోలింగ్ చేసుకోవడం తప్పించి నిజానికి చాలా యూత్ అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటోంది. పక్కవాడి మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్న కొందరికి పవన్ మాటలు చెంపపెట్టనే చెప్పాలి. పర్సనల్ గా మీ హీరోలను ఎంతైనా ప్రేమించుకోండి, అంతే తప్ప రాజకీయంగా వాటికి ముడిపెట్టొద్దని చెప్పడం విషయాన్ని కుండ బద్దలుకొట్టి చెప్పినట్టే

ఇప్పటికిప్పుడు ఇది అందరినీ ప్రభావితం చేస్తుందని చెప్పలేం కానీ ఒక మార్పుకు మొదటి మెట్టుగా తీసుకోవచ్చు. ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్, తన ఫ్యాన్స్ మధ్య జరిగే వార్ ని ప్రస్తావించిన పవన్ దాన్నో ఉదాహరణగా చెప్పాడు తప్పించి అంతకన్నా పెద్ద ఆన్ లైన్ గొడవలే నిత్యం జరుగుతూ ఉంటాయి. ఇతర స్టార్ హీరోల కంటే నేను తక్కువేనని ఒప్పుకోవడం పొలిటికల్ గానే కాదు బ్రో రిలీజ్ టైంలో ఏపీ సర్కారు ఏదైనా సమస్య సృష్టిస్తే దానికి సంఘటిత మద్దతు దక్కించుకునే అవకాశం ఇచ్చింది. ఈ పరిణామం తాలూకు ఫలితం వెంటనే తేలకపోయినా మెల్లగా అయితే ఉంటుంది