ఒక్క టికెట్ 2400 రూపాయలు… అయినా సోల్డవుట్

తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ టికెట్ రేట్లు వెయ్యి రూపాయలు టచ్ అయితేనే తీవ్రంగా అభ్యంతర పెట్టే విషయమవుతుంది. అలాంటిది దానికి రెట్టింపు ఊహించగలమా. ఒకరకంగా చెప్పాలంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న టికెట్ క్యాప్ విధానాలకు ప్రేక్షకులు థాంక్స్ చెప్పాలి. లేదంటే హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో వీకెండ్ వస్తే కనీసం ఒక్క టికెట్ మీద అయిదు వందలు పెట్టాల్సి వచ్చేది. కానీ కర్ణాటక కేసు వేరు.

మార్చి 19 విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ టికెట్ రేట్లు చుక్కలను తాకుతున్నాయి. ఉదాహరణకు బెంగళూరు బ్రూక్ ఫీల్డ్ మాల్ లో ఉన్న ఐనాక్స్ లో రెక్లైనర్ ప్రైమ్ సీట్ బుక్ చేసుకోవాలంటే అక్షరాలా 2400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వద్దు నార్మల్ చాలంటారా దానికి జస్ట్ వంద రూపాయలు తగ్గించి 2300 పెట్టాలి. సరే ధైర్యం చేసి ఓకే అనుకున్నా అక్కడ టికెట్లు లేవండోయ్. సోల్డ్ అవుట్ పెట్టేశారు. సిటీ అంతా అలా కాదు కానీ మల్టీప్లెక్స్ ధరలు 400 నుంచి రెండున్నర వేల దాకా ఉన్నాయి.

ఈ విషయంగానే కాంతారా చాప్టర్ 1 మీద కొందరు కోర్టు కేసు వేస్తే నిర్మాతలు స్టే తెచ్చుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం గరిష్టంగా రాష్ట్రం మొత్తం 200 రూపాయల కన్నా ఎక్కువ వసూలు చేయకూడదని జిఓ ఇస్తే దానికీ బ్రేక్ పడింది. అందుకే ఈ స్థాయిలో ధరలు భగ్గుమంటున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో ఈ సమస్య లేదు. చెన్నై సింగల్ స్క్రీన్ లో ఇదే దురంధర్ రివెంజ్ ని 105 రూపాయలకు, హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో 200 రూపాయలకు చూసేయొచ్చు. మల్టీప్లెక్సుల్లో గరిష్టంగా 295కి కొనేయొచ్చు.

ఇదంతా ఎలా ఉన్నా దురంధర్ రివెంజ్ మీద క్రేజ్ అయితే మాములుగా లేదు. ఇంకా పది రోజుల సమయం ఉన్నప్పటికీ జనాలు టికెట్లు బుక్ చేసుకోవడానికి పరుగులు పెడుతున్నారు. రిలీజ్ నాటికి ఊహకందని నెంబర్లు నమోదు కావడం ఖాయం. అయినా రెండు వేలే లెక్కచేయనప్పుడు ఇక మాములు రేట్ల జరిగే భీభత్సం గురించి వేరే చెప్పాలా. ప్రపంచవ్యాప్తంగా 18 సాయంత్రం అయిదు గంటలకు అన్ని చోట్ల ఒకే సారి ప్రారంభం కాబోతున్నాయి. ఉత్తరాదిలో కొన్ని నగరాల్లో మధ్యాన్నం రెండు నుంచే స్టార్ట్ చేసే ప్లానింగ్ జరుగుతోందని ముంబై రిపోర్ట్.