ఒపీనియన్: ఇవి రాజమౌళికి వదిలేయండి

ఇండియన్ సినిమాలో పౌరాణికాల విషయానికి వస్తే వాటిని తెరకెక్కించడంలో తెలుగు దర్శకుల తర్వాతే ఎవరైనా. ఎన్టీఆర్ హయాంలో తెలుగులో అత్యద్భుతమైన పౌరాణిక చిత్రాలు వచ్చాయి. రామాయణం, మహాభారతం మీద తెలుగులో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా అద్భుత విజయాలు సాధించాయి. వేరే ఏ భాషలో అయినా పౌరాణికాలను తెలుగు చిత్రాలతో కనీసం పోల్చడానికి కూడా వీల్లేని స్థాయిలో మన దర్శకులు, ఆర్టిస్టులు అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారు.

మన దగ్గర ఉన్న పౌరాణిక సంపద అంతా ఇంతా కాదు. ఒకప్పుడు అంత అద్భుతమైన సినిమాలు చూశాం కాబట్టే.. ఇప్పుడు రామాయణం మీద వచ్చిన ‘ఆదిపురుష్’ మన వాళ్లకు ఏమాత్రం ఆనలేదు. ముఖ్యంగా నిన్నటి తరం ప్రేక్షకులు ఈ సినిమా చూసి బాగా హర్టయ్యారు. రామాయణాన్ని చెడగొట్టారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నిజానికి ఈ రోజుల్లో పౌరాణిక చిత్రాలను డీల్ చేయగలే దర్శకులు.. వాటికి న్యాయం చేయగలిగే ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారన్నది ప్రశ్న. తెలుగులో అయితే రాజమౌళి ఒక్కడే ఇలాంటి సినిమాను సరిగ్గా డీల్ చేయగలడన్నది అందరి నమ్మకం. ‘యమదొంగ’ చిత్రంలో యమలోకంలో సన్నివేశాలను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జానపద చిత్రమైన బాహుబలి చూశాక ఆయన పౌరాణిక చిత్రాన్ని మరింత బాగా డీల్ చేయగలడన్న నమ్మకం కుదిరింది.

అందుకే ఆయన తీస్తానన్న మహాభారతం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణం మీద ‘ఆదిపురుష్’ తీసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. బాలీవుడ్లో మరో రామాయణం సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే మహాభారతం మీదా సినిమాలు చేసే ప్రయత్నంలో వేరే దర్శకులు ఉన్నారు. కానీ ‘ఆదిపురుష్’ చూశాక బాలీవుడ్ దర్శక నిర్మాతలకు ప్రేక్షకులు దండం పెట్టేస్తున్నారు. ఉత్తరాది వాళ్లు సైతం రాజమౌళి మాత్రం ఇలాంటి సినిమాలకు కరెక్ట్ అని.. వాటిని ఆయనకు వదిలేసి వేరే సినిమాలు చేసుకోవడం బెటర్ అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.