త్రివిక్రమ్‌పై జోకులే జోకులు

ఏ ముహూర్తాన మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల సినిమాకు శ్రీకారం చుట్టారో కానీ.. ఈ సినిమాకు ఏదీ కలిసి రావడం లేదు. స్క్రిప్టు ఒక పట్టాన ఓకే కాలేదు. షూటింగ్ ఆలస్యం అయింది. ఒకసారి సినిమా మొదలయ్యాక.. కథ, షూట్ చేసిన సన్నివేశాల మీద సంతృప్తి చెందక.. షూట్ ఆపి.. మళ్లీ వేరే కథ తయారు చేసి దాన్ని పట్టాలెక్కించడం.. ఆ తర్వాత కూడా చిత్రీకరణకు ఏదో ఒక అడ్డంకి రావడం.. ఈ సినిమా కష్టాలు ఎడతెగని విధంగా కొనసాగుతున్నాయి.

ఈ మధ్య టీజర్ రిలీజ్ కావడంతో అంతా సర్దుకుందని.. ఇక సంక్రాంతి లక్ష్యంగా సినిమాను ముందుకు తీసుకెళ్లడమే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ సినిమా గురించి నెగెటివ్ న్యూస్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు తమన్‌ను తప్పించారన్నారు. కానీ అది నిజం కాదని తేలింది. తర్వాతేమో హీరోయిన్ పూజా హెగ్డే మీద వేటు పడిందన్నారు. ఈ న్యూస్ మాత్రం నిజమే అనిపిస్తోంది.

త్రివిక్రమ్ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడం అన్నది ఎవ్వరూ ఊహించని విషయం. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి పూజానే త్రివిక్రమ్‌కు ఫేవరెట్. ఆయనకు ఎవరైనా హీరోయిన్ మీద గురి కుదిరితే వరుసగా మూడు సినిమాలు చేస్తాడని పేరుంది. ఇంతకుముందు సమంతతో అలాగే మూడు సినిమాలు (అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ) చేశాడు. తర్వాత ఆమెను పక్కన పెట్టి పూజా హెగ్డేతో ట్రావెల్ అయ్యాడు. ఆమెతో వరుసగా అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు చేసి.. ‘గుంటూరు కారం’కు కూడా ఆమెనే కథానాయికగా ఎంచుకున్నాడు.

కానీ ఈ సినిమా నుంచి పూజా తప్పుకున్నట్లు వార్తలు రావడంతో వీరి కలయికలో హ్యాట్రిక్ మిస్సయింది. పూజాతో త్రివిక్రమ్ రిలేషన్ గురించి మీమ్ పేజీలు కొన్నేళ్ల నుంచి ఎన్నో జోకులు పేలుస్తున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ ఆమెను పక్కన పెట్టడం మీదా మీమ్స్ హోరెత్తుతున్నాయి. త్రివిక్రమ్ మనసు ఇప్పుడు సంయుక్త వైపు మళ్లిందని.. గతంలో సమంతను పక్కన పెట్టినట్లే పూజాను ఇప్పుడు సైడ్ చేసి ఆమెకు ప్రయారిటీ ఇవ్వబోతున్నాడని.. పూజా స్థానాన్ని సంయుక్తనే భర్తీ చేయబోతోందని పంచులు పేలుస్తున్నారు నెటిజన్లు. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.