అఖిల్ కోసం నాగ్ మరో స్కెచ్

హీరోగా అరంగేట్రం చేయడినికి ముందు అక్కినేని అఖిల్ మీద అంచనాలు మామూలుగా లేవు. ‘సిసింద్రీ’గా పసి పిల్లాడిగానే ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్న అఖిల్.. టీనేజీలో చాలా హ్యాండ్సమ్‌గా కనిపించడంతో అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. అక్కినేని అభిమానులు కూడా ఆ కుటుంబ లెగసీని ముందుకు తీసుకెళ్లే హీరో అవుతాడని అతడిపై చాలా అంచనాలు పెట్టుకున్నారు.

కానీ అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్‌తో అతను చేసిన ‘అఖిల్’ డిజాస్టర్ అయి.. అఖిల్‌ కెరీర్‌ను పెద్ద దెబ్బ కొట్టింది. ఆ తర్వాత రీలాంచ్ పేరుతో నాగార్జున అన్నీ దగ్గరుండి చూసుకున్న ‘హలో’ కూడా నిరాశనే మిగిల్చింది. ‘మిస్టర్ మజ్ను’ కూడా అఖిల్‌కు తొలి విజయాన్నందించలేకపోయింది. ఇప్పుడిక అతడి ఆశలన్నీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మీదే ఉన్నాయి.

ఐతే ఈ చిత్రానికి దర్శకుడు ‘బొమ్మరిల్లు భాస్కర్’ కావడం, అతడి ట్రాక్ రికార్డు ఏమీ బాగాలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐతే హీరోయిన్ పూజా హెగ్డే ఫ్యాక్టర్ కలిసొస్తుందని.. గీతా ఆర్ట్స్ వారి అండ కలిసొస్తుందని భావిస్తున్నారు. ఐతే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ అఖిల్‌కు ఓ మాస్ హిట్ ఇవ్వడం కోసం నాగార్జున మరో స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

‘సైరా నరసింహారెడ్డి’ లాంటి బారీ చిత్రం తర్వాత ఎలాంటి సినిమా, ఎవరితో చేయాలో తేల్చుకోలేకపోతున్న సురేందర్ రెడ్డిని అఖిల్ కోసం లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా అఖిల్ కోసం అతను స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నాడట. అదిప్పుడు ఓ కొలిక్కి వచ్చిందని.. ఈ చిత్రాన్ని నాగార్జునే నిర్మిస్తాడని.. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో అయినా అక్కినేని అభిమానులు కోరుకున్న విజయాన్ని అఖిల్ అందుకుంటాడేమో చూడాలి.