హ‌వ్వ‌.. ఆదిపురుష్ రామాయ‌ణ క‌థ కాద‌ట‌

ఆదిపురుష్ సినిమా రామాయ‌ణం ఆధారంగా తెరకెక్కింద‌ని అంద‌రికీ తెలుసు. మొద‌ట్నుంచి దీన్ని రామాయ‌ణం మీద సినిమాగానే ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇందులో తాను రాముడి పాత్ర చేశాన‌ని ప్ర‌భాస్ స్వ‌యంగా వేదిక మీద చెప్పాడు. సినిమాలో జై శ్రీరామ్ జైశ్రీరామ్ అనే పాట ఉంది. కాక‌పోతే ప్ర‌ధాన పాత్ర‌ల‌కు రాముడు, సీత‌, హ‌నుమంతుడు, రావ‌ణుడు అని కాకుండా.. రాఘ‌వుడు, జాన‌కి, భ‌జ‌రంగ్, లంకేశ్వ‌రుడు అనే ఆయా పాత్ర‌లకున్న వేరే పేర్ల‌ను పెట్టారు.

రిలీజ్ రోజు వ‌ర‌కు ఈ సినిమాను రామాయ‌ణ గాథ‌గానే ప్ర‌చారం చేసి.. ఇప్పుడేమో ఉన్న‌ట్లుండి ఇది రామాయ‌ణం కాదు అంటూ ప్టేట్ మార్చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఆదిపురుష్ ర‌చ‌యితల్లో ఒక‌రైన మ‌నోజ్ ముంతాషిర్ శుక్లా ఒక టీవీ ఛానెల్ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఆదిపురుష్ రిలీజ్ అయిన ద‌గ్గ‌ర్నుంచి ఇదేం రామాయ‌ణం.. రామాయ‌ణ గాథ‌ను ఇలాగేనా తీసేది.. రావ‌ణుడేంటి అలా ఉన్నాడు.. హ‌నుమంతుడి డైలాగ్స్ ఇంత దారుణ‌మా అంటూ ప్రేక్ష‌కులు చిత్ర బృందం మీద విరుచుకుప‌డుతున్నారు.

అనేక స‌న్నివేశాలు.. పాత్ర‌లు.. ఇత‌ర అంశాల మీద అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే విష‌యాన్ని ఒక టీవీ చానెల్ చ‌ర్చ‌లో యాంక‌ర్ ప్ర‌స్తావిస్తే.. ర‌చ‌యిత మ‌నోజ్ ముంతాషిర్ చిత్ర‌మైన వాద‌న చేశాడు. తాము రామాయ‌ణం నుంచి చాలా వ‌ర‌కు స్ఫూర్తి పొందిన మాట వాస్త‌వ‌మే అయినా.. తాము తీసింది మాత్రం రామాయ‌ణ క‌థ‌ను కాద‌ని.. ఇది క‌ల్పిత క‌థ అన్న‌ట్లుగా మాట్లాడాడు.

ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రామాయ‌ణం పేరుతో జ‌నాల‌ను ఉద్వేగానికి గురి చేసి.. సినిమాను ఆ కోణంలోనే ప్ర‌చారం చేసుకుని.. హనుమంతుడి సీట్ అంటూ ప్ర‌చారాన్ని పీక్స్‌కు తీసుకెళ్లి ఇప్పుడు ఇది రామాయ‌ణం కాదు అన‌డం ఏంటంటూ నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు చిత్ర బృందం మీద‌.