దిల్ రాజు తొందరపడనిది అందుకే

నైజాంకు సంబంధించి  సినిమాల డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాల్లో ముందు గుర్తొచ్చే పేరు దిల్ రాజు. ఇప్పుడంటే మైత్రి మేకర్స్ యాక్టివ్ అయ్యారు కానీ గతంలో ఏషియన్, సురేష్, గీతా లాంటి ఒకటి రెండు పెద్ద సంస్థల ఆధిపత్యమే కొనసాగేది. ఆదిపురుష్ కు సంబంధించిన బిజినెస్ డీల్స్ జరుగుతున్నప్పుడు దిల్ రాజు ఒకదశ వరకు ప్రయత్నించి వదిలేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అడిగిన అరవై కోట్లు వర్కౌట్ కాదనిపించి సైడ్ అయ్యారు. కట్ చేస్తే మైత్రి అంత మొత్తానికి ఒప్పేసుకుని పంపిణి బాధ్యతలు తీసుకుని హైదరాబాద్ తో సహా నైజామ్ మొత్తం భారీ సంఖ్యలో థియేటర్లు వచ్చేలా చేసుకున్నారు.

ఓపెనింగ్స్ పరంగా భారీ వసూళ్లు వచ్చాయి. వీకెండ్ వరకు ప్రభాస్ కు తిరుగు లేదు. కానీ అరవై కోట్ల బ్రేక్ ఈవెన్ జరగాలంటే ఆ ఒక్క ప్రాంతం నుంచే నూటా పది కోట్ల దాకా గ్రాస్ రావాలి. ఇది అంత సులభం కాదు. టాక్ పూర్తి పాజిటివ్ గా లేకపోవడం కొంత ప్రతికూలంగా ఉన్నా పెద్ద ఎత్తున జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ రక్షణ కవచంలా నిలబడ్డాయి. సండే వరకు వీటికి ఢోకా లేదు. ఆపై నుంచి కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీ ఉంటే తప్ప ఆదిపురుష్ బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్లదు. దిల్ రాజు ఇంతగా వెనుకడుగు వేయడానికి శాకుంతలం దెబ్బ ఓ కారణమని సన్నిహితుల మాట

గతంలో లైగర్, ఆచార్య తాలూకు వ్యవహారాలు జరిగినప్పుడూ వాటిని వరంగల్ శీనుకి వదిలేసి తప్పుకున్న దిల్ రాజు ఆ నిర్ణయాల వల్ల చాలా సేఫ్ అయ్యారు. ప్రతి సినిమా తనకే కావాలన్న పంతం లేకపోవడం వల్లే ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఆదిపురుష్ కనక యునానిమాస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుని ఉంటే దిల్ రాజుకి మిస్ చేసుకున్న ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడది ఏ కోశానా ఉండదు. ఎలాగూ సలార్ తనకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆదిపురుష్ చేజారడం పట్ల ఎలాంటి భావం బయటికి కనిపించనివ్వడం లేదని దిల్ కాంపౌండ్ టాక్