డిజాస్టర్ తర్వాత కసి కనిపిస్తోంది

హీరో కొత్తవాడు.. హీరోయిన్ కొత్తమ్మాయి.. దర్శకుడు, నిర్మాతలు అందరూ కూడా తెలియని వాళ్లే. అయినా సరే ‘ఆర్ఎక్స్ 100’ అనే సినిమా సెన్సేషనల్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తొలి రోజు ఇలా అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన సినిమాకు హౌస్ ఫుల్స్ పడటం అంటే చిన్న విషయం కాదు. సినిమాలో కూడా విషయం ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర  సంచలన విజయం సాధించింది ‘ఆర్ఎక్స్ 100’. ఈ సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి పేరు మార్మోగింది.

తన తర్వాతి చిత్రం ‘మహాసముద్రం’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలను కనీస స్థాయిలోనూ అందుకోలేదు. దీంతో అజయ్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. తొలి చిత్రం తర్వాత తనతో పని చేయడానికి ఆసక్తి చూపిన స్టార్లు.. తర్వాత వెనక్కి తగ్గారు. మళ్లీ తొలి సినిమా ముందు పరిస్థితికి వెళ్లాడతను. అజయ్‌లో కసి కూడా అప్పటి స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది.

‘మంగళవారం’ అనే టైటిల్ పెట్టి.. తన తొలి సినిమా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌నే లీడ్ రోల్‌కు ఎంచుకుని ఒక సెన్సేషనల్ సినిమాకు శ్రీకారం చుట్టాడు అజయ్. ఈ సినిమా టైటిల్‌తోనే అతను ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాడు. మంగళవారం అనే పదాన్ని ఒక బూతు సామెత కోసం వాడతారన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులను టీజ్ చేయడానికే ఈ టైటిల్ పెట్టాడన్నది స్పష్టం. తొలి సినిమా తరహాలోనే ఇది కూడా బోల్డ్‌గా ఉండబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్‌ను 60 రోజుల పాటు ఆపకుండా పూర్తి చేశాడు అజయ్. తాజాగా షూట్ విశేషాలతో ఒక వీడియో రిలీజ్ చేశాడు. పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కినట్లు కనిపిస్తున్న సినిమా కాస్త భారీగానే ఉండేలా కనిపిస్తోంది. నటీనటుల  పాత్రలేమీ రివీల్ చేయకుండా సినిమా ఎలాంటి వాతావరణంలో సాగుతుందో మాత్రం చూపించాడు ఈ వీడియోలో. మహాసముద్రం డిజాస్టర్ తర్వాత అజయ్ చాలా కసిగా ఈ సినిమా తీస్తున్నాడనే సంకేతాలను ఈ వీడియో ఇచ్చింది. జులై లేదా ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ‘ఆర్ఎక్స్ 100’ లాగే అజయ్ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.