అనుపమ.. తెలుగులో ఫస్ట్ టైం

అనుపమ పరమేశ్వర్ మలయాళ అమ్మాయే అయినా.. ఆమె తెరంగేట్రం చేసింది కూడా మాలీవుడ్‌లోనే అయినా.. ఆమె ఎక్కువ సినిమాలు చేసింది.. ఎక్కువ పేరు సంపాదించింది మాత్రం తెలుగులోనే. ప్రేమమ్ తెలుగు వెర్షన్‌తో ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత అఆ, శతమానం భవతి, హలో గురూ ప్రేమ కోసమే లాంటి హిట్ సినిమాలతో టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

కానీ ఆ ఆపై కొన్ని ఫ్లాపులు ఎదుర్కొని ఒక టైంలో తెలుగులో సినిమాలే లేని పరిస్థితికి చేరుకుంది. ఇక ఆమె కెరీర్ క్లోజ్ అయినట్లే అనుకుంటున్న టైంలో మళ్లీ అనుపమకు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. రౌడీ బాయ్స్, 18 పేజెస్ లాంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్న ఈ రింగుల జుత్తు అమ్మాయి.. త్వరలోనే ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఆమె కొత్తగా తెలుగులో మరో సినిమాను అంగీకరించింది.

‘సినిమా బండి’ అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రవీణ్ కంద్రేగుల దర్శకత్వంలో నటించబోతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు రాజ్-డీకే నిర్మించిన ‘సినిమా బండి’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై మంచి స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ‘సినిమా బండి’కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అట.

అనుపమ మలయాళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది కానీ.. తెలుగులో ఇంత వరకు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఆమెకు అంత మార్కెట్ స్టామినా లేదన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదేమో. కానీ ‘సినిమా బండి’ లాంటి రియలిస్టిక్ మూవీతో వినోదాన్ని పంచిన ప్రవీణ్ ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతుండటం విశేషమే. ప్రస్తుతం అనుపమ ‘టిల్లు స్క్వేర్’తో పాటు రవితేజ సరసన ‘ఈగల్’లోనూ నటిస్తోంది.