అయిదు గుర్రాల పరుగు పందెం

రేపు టాలీవుడ్ బాక్సాఫీస్ కొత్త సినిమాలతో కళకళలాడనుంది. అలా అని జనాలు తండోపతండాలుగా వచ్చి థియేటర్లను నింపేస్తారనుకుంటే మాత్రం పొరపాటే. మార్నింగ్ షో కనీసం సగం ఫుల్ అయినా గొప్పే అనేంత తక్కువ బజ్ తో ఇవి రిలీజ్ కాబోతున్నాయి. హైదరాబాద్ లోనే ఎక్కువ రోజులు ఉండి అంతా తానై ప్రమోషన్ చేసిన సిద్దార్థ్ కు ‘టక్కర్’ మీద బోలెడు నమ్మకముంది. ఇది పెద్ద హిట్టు కొట్టి తనను మెయిన్ లీగ్ లోకి తెస్తుందనే ధీమా ఇంటర్వ్యూలలో వ్యక్తం చేస్తున్నాడు. ఓపెనింగ్స్ పెద్దగా ఉండవు కానీ పబ్లిక్ టాక్ చాలా కీలకం కానుంది.

సముతిరఖని-అనసూయ ప్రధాన పాత్రలు పోషించిన ‘విమానం’ చైల్డ్ సెంటిమెంట్ ని నమ్ముకుని ఫ్యామిలీ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకుంది. పబ్లిసిటీ బాగా చేయడంతో పాటు మంచి థియేటర్లైతే పట్టారు కానీ బలగం రేంజ్ లో టాక్ వస్తేనే గట్టెక్కుతుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథలు వర్కౌట్ అవ్వడాన్ని గమనించిన ‘ఇంటింటి రామాయణం’ టీమ్ హఠాత్తుగా థియేట్రికల్ రిలీజ్ కు నిర్ణయం తీసుకుంది. ఇవాళ సాయంత్రమే ప్రీమియర్లు మొదలుపెడుతున్నారు. బిగ్ బాస్ సన్నీ సప్తగిరి హీరోలుగా రూపొందిన ‘అన్ స్టాపబుల్’ కామెడీ లవర్స్ నే నమ్ముకుంది.

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ‘యూనివర్సిటీ’ రేపే వస్తోంది. విద్యాలయాల్లో సామజిక సమస్యల మీద దీన్ని రూపొందించారు. ఇవి  కాకుండా మరో మూడు చిన్న సినిమాలున్నాయి కానీ పందెం మాత్రం ప్రధానంగా పైన చెప్పిన అయిదు గుర్రాల మధ్యే ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ దేనికీ పెద్దగా లేవు. హాలీవుడ్ మూవీ ‘ట్రాన్స్ ఫార్మార్స్ రైజ్ అఫ్ ది బీస్ట్స్’ కు మల్టీప్లెక్సుల్లో ప్రధాన కేంద్రాల్లో భారీ రెస్పాన్స్ కనిపిస్తోంది. సునామిలా విరుచుకుపడబోతున్న ఆదిపురుష్ కు కేవలం వారం ముందు వస్తున్న ఈ మూవీస్ అన్నింటికి వసూళ్ల పరంగా మొదటి ఏడు రోజులే కీలకం కానున్నాయి.