లావణ్య ప్రేమలో వరుణ్.. అఫీషియల్

కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. మెగా ఫ్యామిలీ కుర్రాడు వరుణ్ తేజ్.. తనతో కలిసి రెండు సినిమాల్లో నటించిన ఉత్తరాది భామ లావణ్య త్రిపాఠిని పెళ్లాడబోతున్నాడు. ఈ నెల 9న వరుణ్, లావణ్యల నిశ్చితార్థం జరగనున్నట్లు వస్తున్న వార్తలే నిజమయ్యాయి.

ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీకి సన్నిహితుడైన పీఆర్వో శివ చెర్రీ అధికారికంగా ప్రకటించాడు. ‘‘మేమందరం ఎదురు చూస్తున్న సందర్భం వచ్చేసింది. ఈ నెల 9న నిశ్చితార్థం చేసుకోనున్న వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు’ ’అంటూ వరుణ్, లావణ్యల ‘మిస్టర్’ సినిమా స్టిల్‌తో విషెస్ చెప్పాడు శివ చెర్రీ. మెగా ఫ్యామిలీకి చెందిన ఇతర పీఆర్వోలు, అభిమాన సంఘాల నాయకులు కూడా ఈ పోస్టును ట్వీట్ చేస్తున్నారు. కాసేపట్లోనే ఈ పోస్టు వైరల్ అయిపోయింది.

‘వంశీ’ లాంటి డిజాస్టర్ మూవీకి కలిసి పని చేస్తూ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లే.. వరుణ్, లావణ్యలను సైతం ఒక పెద్ద ఫ్లాప్ మూవీనే కలిపింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్’లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆ తర్వాత ఇదే జోడీ కలిసి ‘అంతరిక్షం’ చేసింది.

అది మంచి సినిమానే అయినా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం రాబట్టలేకపోయింది. కానీ ఆ చిత్రంతో వరుణ్, లావణ్యల బంధం బలపడింది. కొన్నేళ్ల నుంచి వీరి ప్రేమాయణం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఒక్కసారి కూడా వీళ్లిద్దరూ కలిసి మీడియా కంట పడలేదు.

ఐతే ఈ మధ్య మెగా ఫ్యామిలీ వేడుకల్లో లావణ్య కనిపించడంతో వరుణ్‌కు, ఆమెకు మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారం జోరందుకుంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని, నిశ్చితార్థం జరగబోతోందని గత కొన్ని నెలల్లో వార్తలు ఊపందుకున్నాయి. జూన్ 9న ఎంగేజ్మెంట్ అనే వార్త కూడా రెండు వారాల ముందే బయటికి వచ్చింది. ఇప్పుడు ఆ విషయమే నిజమని తేలిపోయింది.