సురేష్ బాబు అనుమానమే నిజమయ్యింది

అహింస ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు తేజ చెప్పిన మాట అక్షరాలా నిజమయ్యింది. షూటింగ్ తొంబై శాతం అయ్యాక సురేష్ బాబు రషెస్ చూసి ఇదేంటి ఇలా తీశారని ఆపేయమని అడగటం, కానీ అభిరాంని లాంచ్ చేస్తానని రామానాయుడుగారికి ఇచ్చిన మాటను గుర్తు చేసి ఇది పూర్తి చేశానని తేజ ప్రస్తావించడం ఆ స్పీచ్ లో హైలైట్ అయ్యింది. అయితే సుదీర్ఘ అనుభవమున్న సురేష్ బాబు అనుమానమే నిజమయ్యింది. నిన్న రిలీజైన అహింసకు పబ్లిక్ టాక్ కానీ, రివ్యూలు కానీ ఏ మాత్రం సానుకూలంగా రాలేదు. పర్వాలేదని మాట వచ్చినా సంతోషపడొచ్చు కానీ అది జరగలేదు.

నేను స్టూడెంట్ సర్, పరేషాన్ లతో పోటీ పడిన అహింసకు అంతో ఇంతో ఓపెనింగ్స్ వచ్చాయంటే అది దగ్గుబాటి అభిమానులు సపోర్ట్ చేయడం వల్లే. అయితే అభిరాం యాక్టింగ్ పరంగా అంతగా సంతృప్తిపరచలేకపోయాడు. దీని సంగతలా ఉంచితే అహింసని తేజ డీల్ చేసిన తీరు థియేటర్ ఆడియన్స్ ని హింస పెట్టేసింది. రివెంజ్ డ్రామాలో అవసరం లేని ఉపకథలు, పాటలు జోడించి విపరీతమైన ల్యాగ్ తో నడిపించిన తీరు విమర్శలకు దారి తీసింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సీత చూసినప్పుడే తేజ మీద మొదలైన భయాలు ఇప్పుడు మరింత బలంగా మారాయి.

దీని సంగతలా ఉంచితే తేజ త్వరలో రానాతో రాక్షస రాజు చేయబోతున్నాడు. తమ్ముడికి ఇలాంటి అవుట్ ఫుట్ ఇచ్చినా అన్నయ్య మరో ఛాన్స్ ఇవ్వడానికి కారణం నేనే రాజు నేనే మంత్రి. అహింసకు నిర్మాత సురేష్ బాబు కాదు కాబట్టి స్క్రిప్ట్ వ్యవహారాల్లో తలదూర్చి ఉండకపోవచ్చు. కానీ రాక్షస రాజు తమ ప్రొడక్షన్ అయినప్పుడు ప్రతిదీ జాగ్రత్తగా కాచివడబోస్తూ చూసుకుంటారు. ఎటొచ్చి తేజ తన నెరేషన్ స్టైల్ మార్చుకుంటే తప్ప సక్సెస్ బాట పట్టడం కష్టం. మరోవైపు గోపిచంద్ కూడా పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. వీళ్లిద్దరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటే తేజ మళ్ళీ ట్రాక్ లో పడొచ్చు.