నాగ్ సినిమా.. మళ్లీ ట్విస్ట్

అక్కినేని వారి కష్టాలు ఇప్పుడు మామూలుగా లేవు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. ఈ ముగ్గురిలో ఎవరి పరిస్థితి మెరుగో చెప్పలేని పరిస్థితి. ముగ్గురూ కూడా బాక్సాఫీస్ దగ్గర వరుసగా చేదు అనుభవాలు ఎదుర్కొంటూ తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియని అమోమయంలో ఉన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు వైభవం చూసిన నాగార్జున.. ఇప్పుడు తీవ్ర ఇబ్బందికర స్థితిలో ఉన్నాడు.

ఆయన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు రావడం కష్టమైపోతోంది. ‘వైల్డ్ డాగ్’ విషయంలో అదే జరిగింది. ఇక నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘ది ఘోస్ట్’ అయితే అడ్రస్ లేకుండా పోయింది. అప్పట్నుంచి తర్వాతి సినిమా విషయంలో ఎడతెగని కసరత్తు చేస్తున్నాడు నాగ్. కానీ ఎంతకీ ఆ సినిమా సంగతి ఒక కొలిక్కి రావడం లేదు. ఒక మలయాళ సినిమా హక్కులు తీసుకుని రైటర్ ప్రసన్న కుమార్‌తో మార్పులు చేర్పులు చేయించి స్క్రిప్టు రెడీ చేయించిన నాగ్.. అతణ్నే దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేయాలనుకున్నాడు.

కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ప్రసన్నను రైటర్ పాత్రకే పరిమితం చేసి.. దర్శకత్వ బాధ్యతలు వేరొకరికి అప్పగించాలని నాగ్ చూస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి కూడా చెప్పకనే చెప్పాడు. కానీ తర్వాత మీడియాలో ఇంకో వెర్షన్ వినిపించింది. దర్శకుడిని మార్చాలనే ఆలోచనను నాగ్ మార్చుకున్నాడని.. ప్రసన్నతోనే వెళ్లిపోవాలని డిసైడయ్యాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో మళ్లీ ట్విస్ట్ అంటున్నారు. ప్రసన్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయట్లేదట. సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నారట.

శ్యామ్ మలయాళంలో మంచి పేరున్న సినిమాటోగ్రాఫర్. అక్కడే మమ్ముట్టి హీరోగా ఒక సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలకు ఛాయాగ్రహణం అందించాడు. ఈ మద్యే ‘విరూపాక్ష’లో తన ప్రతిభను చూపించాడు. ఎలాగూ రీమేక్ చేస్తున్నది యలయాళ సినిమా. శ్యామ్‌ దర్శకుడిగా రుజువు చేసుకున్నాడు. కాబట్టి స్క్రిప్టు బాధ్యతల వరకు ప్రసన్నను పరిమితం చేసి.. శ్యామ్‌కే దర్శకత్వం అప్పగిద్దామని నాగ్ ఫిక్సయినట్లు చెబుతున్నారు.