విడుదల రోజు ఇంట్లో సినిమా ఛాన్సే లేదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేయబోతున్న డైరెక్ట్ హోమ్ రిలీజ్ కాన్సెప్ట్ మీద ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మెన్ గౌతమ్ రెడ్డి చెప్పిన మాటలు చర్చకు దారి తీశాయి. దాని ప్రకారం కొత్త సినిమాలు విడుదల రోజే కేవలం 99 రూపాయలు కట్టి ఇంట్లోనే చూసుకోవచ్చట. కాకపోతే ఇరవై నాలుగు గంటలో షోని పూర్తి చేసుకోవాలి. సరే ఈ టైం ఫ్రేమ్ పెద్ద ఇబ్బంది కాదు కానీ అసలు ఇది అమలులో ఎంత మేరకు సాధ్యమని ప్రాక్టికల్ గా ఆలోచిస్తే దరిదాపుల్లో కూడా నో అనే చెప్పాలి. ఎగ్జిబిషన్ వ్యవస్థను దెబ్బ తీసే ఇలాంటి ప్రయత్నాలకు నిర్మాతల మద్దతు ఎలా వస్తుంది

ఇక్కడ విశ్లేషించుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ముందు టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ గా ఉన్న రోజుల్లో ఇంట్లోనే హెచ్డి క్వాలిటీతో షో వేసుకుంటే అది చాలా తేలికగా కోట్లాది మందికి పైరసీ రూపంలో చేరిపోతుంది. దాన్ని కట్టడి చేయడానికి ఎంత సాంకేతికత వాడినా ప్రయోజనం ఉండదు. వేల కోట్ల టర్నోవర్ ఉన్న నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వల్లే చేతకాని సమస్య ఇది. తర్వాతి అంశం ఇలా చేస్తే థియేటర్లకు ఎవరొస్తారనే పాయింట్. ఒకపక్క కదలకుండా మొదటి రోజే చూసే సౌలభ్యం ఉన్నప్పుడు అదే పనిగా వందలు వేలు పోసి హాళ్లకు వెళ్లే ఆడియన్స్ ఎంతమంది ఉంటారు.

ఈ మోడల్ ల్యాబులో మగ్గిపోతూ నిర్మాత ఆర్థిక పరిస్థితుల వల్ల బయటికి రాలేక ఇబ్బంది పడుతున్న చిన్న సినిమాలకు తప్ప ఇంకెవరికి పని చేయదు. ఆదిపురుష్, గేమ్ చేంజర్ లాంటివి కాదు లేదా కనీసం సంతోష్ శోభన్ లాంటి చిన్న హీరోల చిత్రాలను ఇవ్వడానికి కూడా ప్రొడ్యూసర్లు ఒప్పుకోరు. అలాంటప్పుడు ఇదంతా ఊరికే పబ్లిసిటీ ఆరాటం అవుతుందే తప్ప నిజంగా జరిగే ఆస్కారం ఎక్కడిది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఆర్టిస్టుల దాకా ఎవరూ దీన్ని సమర్ధించరు. థియేటర్ రన్ పూర్తయ్యాక చేస్తే ఓకే కానీ మరీ అన్ని సినిమాలు ఫస్ట్ డే ఇంట్లోనే చూడొచ్చంటే నమ్మేదెలా