సీఎంను నిలదీసిన చిన్మయి

‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక ఫిలిం ఇండస్ట్రీలోనే కాక వివిధ రంగాల్లో మహిళల మీద జరిగే అఘాయిత్యాల విషయంలో అలుపెరగని పోరాటం చేసింది, చేస్తోంది సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. ముఖ్యంగా తమిళ లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తు మీద ఆమె చేసిన ఆరోపణలు.. చేసిన పోరాటం చర్చనీయాంశంగా మారింది. కానీ చిన్మయి ఎన్ని ఆరోపణలు చేసినా.. ఫిర్యాదులు చేసినా.. ఎన్ని ఉదంతాలను ఉదాహరణగా చూపించినా.. వైరముత్తు మీద ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేవు.

సినీ, రాజకీయ ప్రముఖులతో వైరముత్తుకు ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే ఆయన దర్జాగా తిరిగేస్తున్నారని.. తమకు న్యాయం చేయట్లేదని చిన్మయి ఆరోపిస్తోంది. తాజాగా ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను వైరముత్తు విషయంలో నిలదీసింది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శర్‌ణ్ మీద పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోఫణలు చేయడం.. కొన్ని నెలలుగా అతడికి వ్యతిరేకంగా పోరాడుతుండటం తెలిసిందే.

ఐతే వారిని కేంద్ర ప్రభుత్వం అణచివేయాలని చూస్తోంది. తాజాగా పార్లమెంటు ముందు నిరసనకు ప్రయత్నించిన రెజ్లర్ల మీద పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీన్ని ఖండిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ రెజ్లర్లకు మద్దతుగా ట్వీట్ వేశారు. దీనిపై చిన్మయి స్పందిస్తూ.. మహిళా రెజ్లర్లకు బాసటగా నిలుస్తున్న స్టాలిన్.. వైరముత్తుపై తాము చేస్తున్న ఆరోపణలపై ఎందుకు స్పందించరని నిలదీసింది.

“బ్రిజ్‌ భూషణ్‌కైనా, వైరముత్తుకు అయినా ఒకే నిబంధనలు ఉండాలి. బ్రిజ్‌ భూషణ్‌ తమని వేధించాడంటూ మన దేశం గర్వించే ఛాంపియన్లతో పాటు ఒక మైనర్‌ సైతం వ్యాఖ్యలు చేసింది. మీ పార్టీతో సత్సంబంధం ఉన్న వైరముత్తు వేధించాడంటూ గతంలో నాతోపాటు 17 మంది మహిళలు బహిరంగంగా వెల్లడించాం. దీంతో ఆ వ్యక్తి మా కెరీర్‌ను నాశనం చేశాడు. మమ్మల్ని పరిశ్రమ నుంచి బహిష్కచించేలా చేశాడు. మాకున్న కలలతో పోలిస్తే వైరముత్తు ప్రతిభ గొప్పదేమీ కాదు. దయచేసి, వైరముత్తు లాంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోండి. దాని వల్ల తమిళనాడులోని పని ప్రదేశాలు సురక్షితంగా ఉంటాయి. సొంత ఇండస్ర్టీ నుంచే బహిష్కరణకు గురైన ఒక మహిళగా నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఎందుకంటే వైరముత్తుకు ఉన్న రాజకీయ అండతో అతను రెచ్చిపోతున్నాడు. దాని వల్ల అతనికి వ్యతిరేకంగా నాకు మద్దతు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు” అని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది.