టాలీవుడ్ స్టార్లకు ఆ ముద్ర మంచిదేనా?

ఒకప్పుడు సినీ నటులు ఓవైపు సినిమాలు చేసుకుంటూ.. ఇంకోవైపు పార్ట్ టైం రాజకీయాలు చేసేవాళ్లు. నటనను వదిలేసి పూర్తిగా రాజకీయాల్లోకి రావడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి.. సినిమాల్లో ఉంటూనే తమకు నచ్చిన పార్టీ తరఫున పని చేసేవారు. కొందరేమో పరోక్ష మద్దతు ప్రకటించేవాళ్లు. పార్టీలతో సన్నిహితంగా మెలిగేవాళ్లు. దాని ద్వారా కొంత ప్రయోజనమూ పొందేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

ఏదైనా సినీ నటులు రాజకీయ రంగు పులుముకోవడం ప్రమాదకరంగా మారుతోంది. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి పని చేస్తే వేరు కానీ.. సినిమాల్లో ఉంటూ ఒక పార్టీకి అనుకూలురుగా ఉండటం అన్నది మేలు కంటే చేటే చేస్తోంది. ఈ సోషల్ మీడియా కాలంలో నటుల రాజకీయ భావజాలాన్ని బట్టి వాళ్లను టార్గెట్ చేయడం.. వారి సినిమాలను దెబ్బ కొట్టడం లాంటివి జరుగుతున్నాయి.

బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ లాంటి వాళ్లు యాంటీ మోడీ స్టాండ్ తీసుకోవడం వల్ల వాళ్ల సినిమాల మీద ప్రతికూల ప్రభావం పడింది. ఒక టైంలో హిందూ ప్రో గ్యాంగులు సోషల్ మీడియాలో యాంటీ హిందు ముద్ర వేసి ఆమిర్ సహా కొందరి సినిమాలను దెబ్బ కొట్టారు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ లాంటి బీజేపీ ప్రో స్టార్ల సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర దెబ్బ పడింది. వాళ్ల సినిమాలు సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యాయి. టాక్‌తో సంబంధం లేకుండా వీరి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర దారుణ ఫలితాలు అందుకున్నాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్లు కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభాస్ కొత్త చిత్రం ‘ఆదిపురుష్’ను బీజేపీ మద్దతుదారులు ఇప్పుడు నెత్తికెత్తుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నిఖిల్ ‘కార్తికేయ-2’ సినిమా సక్సెస్ తర్వాత బీజేపీ ప్రో ముద్ర వేయించుకుంటున్నాడు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్.. ఇప్పుడు అతడితో ‘ది ఇండియా హౌస్’ అనే సినిమా తీస్తున్నాడు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే వివాదాస్పద సినిమాతో అభిషేక్.. మోడీ క్యాంప్ మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

‘ది ఇండియా హౌస్’ కూడా అలాంటి ప్రాపగండా మూవీనే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా భాగస్వామి కావడం గమనార్హం. ‘ఆర్ఆర్ఆర్’లో రాముడిని గుర్తుకు తెచ్చే గెటప్ వేయడంతో నార్త్ ఇండియాలో హిందూ ప్రో గ్యాంగ్స్ అన్నీ ఆల్రెడీ అతణ్ని ఓన్ చేసుకున్నాయి. ఇప్పుడు ‘ది ఇండియా హౌస్’తో చరణ్ మీద మరింతగా ఒక ముద్ర పడిపోయే అవకాశముంది. ప్రస్తుతానికి టాలీవుడ్ స్టార్లకు ప్రమాదం లేకపోవచ్చు కానీ.. మరీ ఎక్కువగా కాషాయం పులుముకుంటే మాత్రం అక్షయ్, కంగనాల మాదిరి ఎదురు దెబ్బలు తినాల్సి రావచ్చు.