తేజ.. రానా.. రాక్షస రాజు

చిత్రం, నువ్వు నేను, జయం సినిమాల్లో రెండు దశాబ్దాల కిందట సంచలనం రేపిన దర్శకుడు తేజ. తొలి సినిమా ‘చిత్రం’తోనే ట్రెండ్ సెట్ చేసిన తేజ.. ఆ తర్వాత నువ్వు నేను, జయం సినిమాలతో యువతను ఒక ఊపు ఊపేశారు. దీంతో ఆయనపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆ అంచనాలను తర్వాతి కాలంలో అందుకోలేకపోయాడు. రెండంకెల సంఖ్యలో ఫ్లాపులు తీసి పూర్తిగా అభిమానుల నమ్మకాన్ని కోల్పోయాడు.

ఇక తేజ నుంచి హిట్ సినిమా రాదు అనుకున్న సమయంలో 2017లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సూపర్ హిట్ అయింది. రానాకు సోలో హీరోగా ఇది పెద్ద హిట్. ఇందులో రానా పెర్ఫామెన్స్.. తేజ దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. దీని తర్వాత తేజ తీసిన ‘సీత’ డిజాస్టర్ అయింది ఇప్పుడాయన రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటితో తీసిన ‘అహింస’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో తన తర్వాతి సినిమా గురించి ఆసక్తికర విషయం బయటపెట్టాడు తేజ. మళ్లీ తాను రానాతో జట్టు కట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ సినిమా టైటిల్‌ను కూడా తేజ ప్రకటించేశారు. రాక్షస రాజు.. ఇదీ రానా కోసం రాస్తున్న కొత్త కథకు తాను అనుకుంటున్న టైటిల్ అని తేజ తెలిపారు. ఐతే ఈ టైటిల్ ఇంకా కన్ఫమ్ కాలేదని.. ముందు పేరు ఎలా ఉందో చెప్పాలని ఈ వేడుకకు హాజరైన అభిమానులను అడిగారు తేజ. అక్కడి నుంచి మంచి స్పందనే వచ్చింది.

ఇక ఈ సినిమాతో 45 మంది కొత్త నటీనటులను పరిచయం చేయాలని అనుకుంటున్నట్లు తేజ వెల్లడించడం విశేషం. లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామా నాయుడు స్వస్థలం అయిన చీరాల నుంచి కనీసం పది మంది అయినా కొత్త వారిని ఈ సినిమాతో పరిచయం చేయాలనుకుంటున్నట్లు తేజ తెలిపాడు. ఆసక్తి ఉన్న వాళ్లు ఇన్‌స్టాలో తనను ఫాలో అయితే వివరాలు చెబుతానని తేజ అన్నాడు. ‘రాక్షస రాజు’ను ఆటోమేటిగ్గా సురేష్ బాబే నిర్మిస్తాడని భావిస్తున్నారు.