త్రివిక్రమ్ టచ్‌యే కాపాడాలి

రీఎంట్రీలో పవన్ కళ్యాణ్ నుంచి థియేటర్లలోకి వచ్చిన రెండు సినిమాలూ (వకీల్ సాబ్, భీమ్లా నాయక్) రీమేక్‌లే. అభిమానులు వద్దే వద్దంటున్నా వినకుండా ఆయన ఇంకో రీమేక్ మూవీని లైన్లో పెట్టేశాడు. తన పార్ట్ వరకు ఆల్రెడీ షూట్ కూడా పూర్తి చేశాడు. ఆ చిత్రమే.. బ్రో. ఇది తమిళ హిట్ ‘వినోదియ సిత్తం’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ తీసిన సముద్రఖనినే ఇక్కడా డైరెక్ట్ చేస్తున్నాడు.

ఐతే మాతృకను చూసిన వాళ్లందరూ ఇలాంటి సినిమా తెలుగులో వర్కవుట్ అవుతుందా.. అసలు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో ఇలాంటి సినిమా ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ‘వినోదియ సిత్తం’ స్టోరీ తెలిస్తే ఎవ్వరైనా ఇలాగే ఆశ్చర్యపోతారు.

తాను లేకుండా ఇల్లు, ఆఫీస్ రెండూ గడవవు, అంతా తనే నడిపిస్తున్నాడు అనుకునే ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. దైవదూత వచ్చి అతడికి తిరిగి బతికే అవకాశం ఇచ్చి.. కొన్ని నెలలు గడువు ఇవ్వడం.. అన్ని పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో తాను నిమిత్తమాత్రుడినని అర్థం చేసుకుని.. వినమ్రంగా తిరిగి ఈ లోకాన్ని విడిచి వెళ్లడం.. ఇదీ ‘వినోదియ సిత్తం’ స్టోరీ.

ఆల్రెడీ ఈ హిందీలో కూడా రీమేక్ అయింది. అక్కడ నడి వయస్కుడి పాత్రను కుర్రాడిగా మార్చ తీశారు. కానీ హిందీలో ఈ సినిమా ఫ్లాప్ అయింది. మరి తెలుగులో మాత్రం ఎలా వర్కవుట్ అవుతుంది అనే సందేహాలున్నాయి.

ఒరిజినల్లో సముద్రఖని చేసిన పాత్రనే ఇక్కడ పవన్ చేస్తుండగా.. ఆయన్నుంచి అభిమానులు ఆశించే మాస్ అంశాలేమీ ఇందులో ఉండవు. ‘గోపాల గోపాల’లో కంటే కూడా క్యారెక్టర్ సాఫ్ట్‌గా ఉంటుంది. లీడ్ క్యారెక్టర్‌ను కుర్రాడిగా మార్చినప్పటికీ హిందీలో వర్కవుట్ కానపుడు తెలుగులో మాత్రం సినిమా ఆడుతుందా అన్న సందేహాలున్నాయి. కాకపోతే ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ టచ్‌యే కాపాడుతుందని చిత్ర బృందం నమ్ముతోంది.

‘తీన్ మార్’, ‘భీమ్లా నాయక్’ లాంటి చిత్రాలకు త్రివిక్రమ్ టచ్‌యే ఆకర్షణగా నిలిచింది. ఆయన మార్కు వినోదం, డైలాగులు తోడైతే సినిమా రూపు రేఖలు మారిపోవడం ఖాయం. పవన్ పాత్రను త్రివిక్రమ్ అలాగే తీర్చిదిద్దాడని.. సినిమాకు కమర్షియల్ హంగులు కూడా బాగానే అద్దారని.. కాబట్టి అభిమానులు మరీ కంగారు పడాల్సిన పని లేదని చిత్ర వర్గాలు అంటున్నాయి.