ముదిరిపోతున్న రీరిలీజుల పంచాయితీ

ట్రెండ్ పేరుతో రీ రిలీజులను అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వీటి కలెక్షన్ల మీద జరుగుతున్న పంచాయితీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర రూపం దాలుస్తోంది. శనివారం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పునఃవిడుదలైన సింహాద్రి మొదటి రోజే అయిదు కోట్ల గ్రాస్ వసూలు చేసిందన్న వార్త యాంటీ ఫ్యాన్స్ కు టార్గెట్ అయిపోయింది. ఖుషి, పోకిరి రికార్డులను బ్రేక్ చేసిందని పలు ట్వీట్లు హల్చల్ చేయగా అదేమీ లేదంటూ మహేష్ పవన్ అభిమానులు వాటికి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. పరస్పరం కవ్వించుకుంటూ రెచ్చగొట్టుకునే దాకా వెళ్లారు.

నిజానికి ఈ పాత చిత్రాల రీరిలీజుల సంబరం రెండు మూడు రోజులకు పరిమితం అంతే. ఇప్పటిదాకా ఈ క్యాటగిరీలో వచ్చిన అన్ని సినిమాలు యూట్యూబ్ లో ఫ్రీగా దొరుతున్నవే. అయినా సరే థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం ఆడియన్స్ వీటిని చూస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు వరసగా దింపుతున్నారు. తారక్ బర్త్ డే కలిసి రావడంతో పాటు రాజమౌళి కాంబో కాబట్టి సింహాద్రికి గ్రాండ్ సెలెబ్రేషన్లు చేశారు. సీడెడ్ తో సహా పలు కీలక కేంద్రాల్లో నిజంగానే రికార్డులు నమోదయ్యాయి. కొత్త మూవీస్ అయితే నిర్మాత అధికారికంగా ప్రకటిస్తాడు కానీ వీటికా అవకాశం లేదు.

రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ప్రెస్టీజియస్ గా తీసుకుని గుడుంబా శంకర్, అతడు లాంటి వాటికి రెట్టింపు రచ్చ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. అయినా వీటి వల్ల లక్షల రూపాయల ఖర్చు పెట్టుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఈ ట్రెండ్ మొదలై ఏడెనిమిది నెలలు దాటేసింది. ఎక్కడో ఒక చోట బ్రేక్ వేయకపోతే ట్విట్టర్ లో ఇన్స్ టాలో ఈ గొడవలు ఇంకో రూపం దాల్చే ప్రమాదం లేకపోలేదు. అత్యుత్సాహం వల్ల కొన్ని థియేటర్లలో ఆస్తి నష్టం జరిగింది. ఇకనైనా రీరిలీజులను కేవలం అనుభూతి చెందేందుకు మాత్రమే వాడుకుంటే మంచిది.