పాపం పసివాడు మాములు సినిమా కాదు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ప్రస్తావించిన పాపం పసివాడు సినిమా గురించి అభిమానుల్లో ఆసక్తి కలిగింది. నిజంగానే ఇది ఆషామాషి మూవీ కాదు. ఓసారి ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. ఈ చిత్రం 1972 సెప్టెంబర్ 29న విడుదలైంది. ఒక హాలీవుడ్ మూవీని స్ఫూర్తిగా తీసుకుని వి రామచంద్రరావు దర్శకత్వంలో రూపొందించారు. ప్రముఖ రచయిత నటులు గొల్లపూడి మారుతీరావు స్క్రిప్ట్ రూపొందించారు. థార్ ఎడారిలో 27 రోజులు షూటింగ్ చేయడం అప్పట్లో సంచలనం.

టైటిల్ పాత్ర పోషించిన చైల్డ్ ఆర్ట్స్ రాముతో పాటు ముప్పై అయిదు మంది యూనిట్ సభ్యులు కలిసి జన వాసాలకు దూరంగా చిత్రీకరణ జరిపారు. ఫ్లైట్ యాక్సిడెంట్ లో మావయ్య చనిపోతే ఒంటరిగా మిగిలిన పసివాడు అడవిలో, ఎడారిలో ప్రమాదకరమైన జంతువుల నుంచి కాపాడుకుంటూ ఎలా బయట పడ్డాడనేది ఆద్యంతం థ్రిల్లింగ్ గా, గుండెలు పిండేసేలా చిత్రీకరించారు. ఎస్వి రంగారావు, సత్యనారాయణ, సూర్యకాంతం, నగేష్, చిత్తూరు నాగయ్య లాంటి సీనియర్ క్యాస్టింగ్ వల్ల సినిమా క్లాసిక్ గా నిలిచిపోయేంత గొప్పగా వచ్చింది. అల్లూరి శేషగిరిరావు నిర్మాత.

రిలీజయ్యాక ప్రమోషన్ల కోసం హెలికాఫ్టర్ల నుంచి పాంప్లెట్లు విసిరేయడం కథలుగా చెప్పుకున్నారు. సక్సెస్ టూర్లు చేశారు. థియేటర్ నుంచి బయటికి వచ్చిన తల్లితండ్రులు, చిన్నారులు కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి రావడం అప్పటి ఆడియన్స్ కి గుర్తే. 10 సెంటర్లలో వంద రోజులు ఆడటం పెద్ద విశేషం. అప్పటి మదరాసు ఇప్పటి చెన్నైలో గ్రాండ్ గా ఈవెంట్ కూడా చేశారు. తమిళ వెర్షన్ కూడా సూపర్ హిట్ అయ్యింది. సత్యం సంగీతం, కన్నప్ప కెమెరా దన్నుగా నిలిచాయి. రాము స్టార్ కిడ్ అయ్యాడు. టాలీవుడ్ లో గుర్తుండిపోయే మాస్టర్ పీస్ పాపం పసివాడు