డబుల్ ఇస్మార్ట్ మీద అంత నమ్మకమా

ఊహించినట్టే పూరి జగన్నాధ్ హీరో రామ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ని అఫీషియల్ గా ప్రకటించారు. లైగర్ దారుణమైన ఫలితం తర్వాత తిరిగి ఈ కలయిక సాధ్యమవుతుందో లేదో అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. అయితే రామ్ దాన్ని పట్టించుకోకుండా కథకే ఓటేశాడు. ఈ స్క్రిప్ట్ మొదటి భాగం నిర్మాణంలో ఉన్నప్పుడే మొదలయ్యిందట. ఇప్పుడు సరిపడినంత సమయం దొరకడంతో పూరి చక్కగా ఫైనల్ వెర్షన్ పూర్తి చేసినట్టు ఇన్ సైడ్ టాక్. ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లకుండా తన టీమ్ తో ఒకటికి పదిసార్లు జల్లెడ చేయించారని వినికిడి

అంతా బాగానే ఉంది కానీ రిలీజ్ డేట్ ని 2024 మార్చి 8 ప్రకటించేశారు. ప్రస్తుతం రామ్ బోయపాటి కాంబోలో రూపొందుతున్న మూవీ ఆగస్ట్ కంతా పూర్తవుతుంది. అక్కడి నుంచి లెక్కేసుకున్నా పూరి కేవలం ఆరు నెలల్లో ఫస్ట్ కాపీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ వేగం పూరికి కొత్త కాదు కానీ ఇప్పుడు మునుపటి క్యాలికులేషన్లు లేవు. లైగర్ దెబ్బ మార్కెట్ మీద తీవ్రంగా పడింది. దాని నష్టాలను పూడ్చాలని డిస్ట్రిబ్యూటర్లు హైదరాబాద్ లో ధర్నాకు దిగారు. దీని వల్ల జరగబోయే డ్యామేజ్ ఇప్పుడేమీ ఉండదు కానీ డబుల్ ఇస్మార్ట్ బిజినెస్ టైంలో ఖచ్చితంగా బయటికి వస్తుంది

మొత్తానికి డూ ఆర్ డై సిచువేషన్ లో పూరి జగన్నాధ్ స్పీడ్ కే ఓటేశాడు. ఇక్కడ ఆడియన్స్ కన్నా ఎక్కువ రామ్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంది. ఇస్మార్ట్ శంకర్ ఎంత హిట్టయినా ఆ టైంలో కొన్ని అంశాలు కలిసి రావడం వల్ల పెద్ద రేంజ్ సక్సెస్ అయ్యిందే తప్ప అల్ టైం బెస్ట్ హిట్స్ లో దానికి చోటివ్వడానికి విశ్లేషకులు ఒప్పుకోరు. అంటే పోకిరి, ఇడియట్ లాంటి ఉన్నత స్థానం దానికి దక్కలేదు. డబుల్ ఇస్మార్ట్ దానికి రెండింతలు బెటరని ఋజువు చేయడంతో పాటు చెప్పిన టైం విడుదల చేసే ఛాలెంజ్ ని పూరి ఎదురుకోవాల్సి ఉంటుంది