ఎన్టీఆర్ సినిమాకు ప్రి రిలీజ్ ఈవెంట్ ఫిక్స్

రీ రిలీజ్ సినిమాల విషయంలో ఏడాదిగా ఎన్నడూ లేని హంగామా చూస్తున్నాం. టాలీవుడ్లో పాత సినిమాలను అప్పుడప్పుడూ రీ రిలీజ్ చేయడం కొత్తేమీ కాదు కానీ.. గత ఏడాది కాలంలో చూసిన హంగామా మాత్రం నభూతో అనే చెప్పాలి. కొత్త సినిమాల తరహాలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం.. థియేటర్లలో అభిమానులు హోరెత్తించేయడం.. కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేయడం.. థియేటర్ల బయట, లోపల సంబరాలు మిన్నంటడం.. ఇదంతా చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అభిమానులు దీన్ని భలేగా ఎంజాయ్ చేస్తున్నారు.

రీ రిలీజ్‌ల పరంగానూ రికార్డుల కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ రీ రిలీజ్ హంగామాను పీక్స్‌కు తీసుకెళ్లి తమ సత్తా ఏంటో చూపించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల వంతు వచ్చింది. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘సింహాద్రి’ రీ రిలీజ్ ఒక రేంజిలో ప్లాన్ చేశారు అభిమానులు.

దీని కోసం ప్లానింగ్ రెండు నెలల నుంచి జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్‌లో భారీ స్థాయిలో ‘సింహాద్రి’ స్పెషల్ షోలు భారీగా ప్లాన్ చేశారు అభిమానులు. దీని కోసం ప్రమోషన్ కూడా గట్టిగా జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మంచి ఊపుమీదున్నాయి.

విశేషం ఏంటంటే.. ఒక రీ రిలీజ్ సినిమాకు తొలిసారిగా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నారు అభిమానులు. ఇందుకు వేదిక కూడా ఖరారైంది. మామూలుగా కొత్త సినిమాలకు ప్రి రిలీజ్ ఈవెంట్లు నిర్వహించే హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్లోనే ఈ వేడుక కూడా చేస్తున్నారు. ఈ నెల 17న ఈవెంట్ జరగబోతోంది.

దీని కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. అభిమానుల సందడి వేరే లెవెల్లో ఉండేలా ఉంది ఈ వేడుకలో. ఎవరైనా ప్రముఖులే ఈ వేడుకకు అతిథిులుగా వస్తారని భావిస్తున్నారు. ఈ హంగామా అంతా చూస్తుంటే రీ రిలీజ్ రికార్డులన్నింటినీ ‘సింహాద్రి’ బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.