కరోనా టైంలో అమితాబ్ చేసిన సాయమేంటి?

కరోనా టైంలో సినిమా వాళ్లు చాలామంది చాలా రకాలుగా సాయాలు చేశారు. అందరిలోకి సోనూ సూద్ గొప్ప సాయాలు చేసి హీరోగా నిలిచాడు. ఐతే అతడితో పోల్చి మిగతా సెలబ్రెటీలను తక్కువ చేయడం కరెక్టా అన్నది జనాలు ఆలోచించాలి. తమ వంతుగా ఏమీ చేయని వాళ్లు సెలబ్రెటీలను మాత్రం టార్గెట్ చేసి మీరేం చేశారని నిలదీస్తున్నారు.

సెలబ్రెటీలు సాయం చేయాలని ఆశించొచ్చు కానీ.. వాళ్లను ఈ విషయంలో డిమాండ్ చేయడం.. విమర్శలు చేయడం సరి కాదు. అయినా అందరు సెలబ్రెటీలు తాము చేస్తున్న సాయాల గురించి ప్రచారం చేసుకోరు. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ కోవకే చెందుతారు. ఆయన హిందీ సినీ కార్మికులతో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్లకు కూడా సాయం చేసిన సంగతి వేరే వాళ్లు చెబితే బయటికి వచ్చింది. అయినా సరే అమితాబ్‌ను తాజాగా ఓ మహిళ.. కోవిడ్ వేళ పేదవాళ్లకు మీరు చేస్తున్న సాయమేంటి అని నిలదీసింది.

దీనికి ఆయన తన బ్లాగ్ ద్వారా సమాధానం ఇచ్చారు. ‘‘కోవిడ్ వేళ నా దాతృత్వం గురించి ఓ మహిళ ప్రశ్నించింది. చేసిన సహాయం గురించి ప్రచారం చేసుకోకూడదని నేను నమ్ముతాను. కానీ మాట్లాడాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. ఆంధ్రప్రదేశ్, విదర్భ, యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులకు సహాయం చేశాం. సినీ పరిశ్రమకు చెందిన పది వేల కుటుంబాలకు ఆరు నెలలుగా రేషన్, ఆహారం అందిస్తున్నాం.

ముంబయి నుంచి తమ స్వగ్రామాలకు కాలినడకన బయల్దేరిన వలస కార్మికులకు 12,000 జతల చెప్పులు అందించాం. నాసిక్ హైవే మీద వాళ్లకు ఆహారం, నీళ్లు అందించాం. చార్టెట్ విమానాల ద్వారా వీలైనంత మందిని వారి స్వగ్రామాలకు తరలించాం. కరోనా యోధులకు 15 వేల పీపీఈ కిట్లు 10 వేల మాస్కులు అందించాం`’ అంటూ తన వైపు నుంచి అభాగ్యులకు ఏ స్థాయిలో సాయం అందింది వివరంగా చెప్పుకొచ్చారు అమితాబ్.