పెళ్లి చేసుకున్నారా అని నరేష్‌ను అడిగితే..

సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల మీద జనాలకే కాక మీడియాకు అమితాసక్తి ఉంటుంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో వ్యక్తిగత వివాదాలతో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన నటుల్లో నరేష్ పేరు ముందు చెప్పుకోవాలి. తన మూడో భార్యతో ఆయన గొడవలు.. పవిత్ర లోకేష్‌తో సహజీవనం గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఈ గొడవలన్నీ కలిపి ‘మళ్ళీ పెళ్ళి’ అని సినిమా కూడా తీసేశారు నరేష్.

సీనియర్ దర్శక నిర్మాత ఎం.ఎస్.రాజు ీ చిత్రాన్ని రూపొందించగా నరేషే స్వయంగా నిర్మించాడు. ఇందులో నరేష్, పవిత్ర నిజ జీవత పాత్రలనే పోలిన క్యారెక్టర్లను ఇందులో పోషించగా.. నరేష్ మూడో భార్య పాత్రను తమిళ నటి వనిత విజయ్ కుమార్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా లాంచ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో.. నరేష్ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. పవిత్ర లోకేష్‌ను మీరు పెళ్లాడారా అని ఒక విలేకరి అడగ్గా.. ఆయన దానికి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘‘పెళ్లి అనే వ్యవస్థను మేం ఎంతగానో గౌరవిస్తాం. ఈ సినిమా దాని గురించే ఉంటుంది. ఈ రోజుల్లో జంటలకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేకే విడిపోతున్నారు. అందు వల్లే ప్రస్తుతం నాలుగైదు ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి. విడాకులు ఇవ్వడానికే ఇవన్నీ. వివాహ వ్యవస్థ ప్రాధాన్యాన్ని ఈ సినిమా చెబుతుంది. ఒక పెళ్లి అంటే ఒక్కో మతంలో ఒక్కో అర్థం ఉంటుంది. కొందరు తాళి కడతారు.. కొందరు ఉంగరం తొడుగుతారు.. కొందరు ఇంకోటి చేస్తారు. కానీ పెళ్లి అంటే రెండు హృదయాలు కలవడం’’ అని నరేష్ చెప్పారు. ఇదంతా కాదు మీరు పవిత్ర గారిని పెళ్లి చేసుకున్నారా లేదా అని విలేకరి రెట్టించి అడిగితే.. ‘‘చెప్పా కదా.. పెళ్లి అంటే రెండు హృదయాలు కలవడం’’ అని ముక్తాయించారు నరేష్.