ప్రమోషన్ల గురించి చైతూ భలే చెప్పాడే..

ఒకప్పటితో పోలిస్తే సినిమాను ప్రమోట్ చేసే తీరే మారిపోయింది. ప్రి రిలీజ్ ఈవెంట్లకు తోడు రకరకాలుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద హీరోలు కూడా ఎంతో ఓపిగ్గా.. మీడియా ప్రతినిధులకు ఉమ్మడిగా.. అలాగే విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. టీవీ, వెబ్ మీడియా ప్రతినిధులను కలిసి సుదీర్ఘ వీడియో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇవి కాక అనేక నగరాల్లో తిరుగుతూ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. ఇవన్నీ ఇష్టం లేని వాళ్లు కూడా అనివార్యంగా చేయాల్సి వస్తోంది.

ఐతే నిజంగా ఒక సినిమాకు ఇలాంటి ప్రమోషన్లు అవసరమా.. అవి ఉపయోగపడతాయా అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ఈ విషయంలో అక్కినేని నాగచైతన్య ఆసక్తికర విశ్లేషణ చేశాడు ఓ ఇంటర్వ్యూలో. ఒక సినిమాకు వీటన్నిటి కంటే టీజర్, ట్రైలర్, పాటలు బాగుండటం ముఖ్యం అని చైతూ అన్నాడు. అవి బాగుంటే.. అంతకు మించి ఏమీ అవసరం లేదన్నట్లు చైతూ మాట్లాడాడు. ప్రోమోలు బాగుంటే ప్రేక్షకుల్లో ఆటోమేటిగ్గా సినిమా పట్ల ఆసక్తి కలుగుతుందని.. ఆ టైంలో ప్రమోషన్లు చేస్తే అవి అదనపు ప్రయోజనం చేకూరుతుందని చైతూ చెప్పాడు.

ప్రోమోలు బాలేకుండా.. సినిమా కూడా బాలేనపుడు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా.. ఎన్ని ఈవెంట్లు చేసినా ప్రయోజనం శూన్యం అని చైతూ కుండబద్దలు కొట్టాడు. ఇక తన చివరి సినిమా ‘థాంక్యూ’ గురించి మాట్లాడుతూ.. ఎడిట్ రూంలో చూసినపుడే ఆ సినిమా ఆడదని తేలిపోయిందన్నాడు. ఆ కథ బాగున్నప్పటికీ.. దాన్ని సరిగ్గా తీయలేదని.. సినిమా ఆడదని ముందే అర్థమైనప్పటికీ.. నిర్మాత నష్టపోకూడదన్న ఉద్దేశంతో ప్రమోట్ చేసినట్లు నిజాయితీగా అంగీకరించాడు చైతూ. ఈ సినిమా తీసిన విక్రమ్ కుమార్ అమేజాన్ ప్రైమ్ కోసం తనతో చేసిన ‘దూత’ మాత్రం చాలా బాగుంటుందని.. అలాగే తన కొత్త చిత్రం ‘కస్టడీ’ని ఎడిటింగ్ టైంలో చూస్తే చిన్న లోపం కూడా కనిపించలేదని చైతూ అన్నాడు.