దిల్ రాజు చేతికొచ్చిన సింహాద్రి గొడ్డలి

ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తోంది కానీ రీ రిలీజుల హవా మళ్ళీ మొదలుకాబోతోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని సింహాద్రిని భారీ ఎత్తున పునఃవిడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తారక్ అభిమానులు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పోకిరి, జల్సా, ఖుషి రికార్డులు నమోదు చేసిన దృష్ట్యా వాటిని బీట్ చేసే విధంగా యంగ్ టైగర్ సత్తా చాటాలని డిసైడయ్యారు. అందులో భాగంగా లిరికల్ వీడియోలను సైతం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. సోడా బుడ్డిని హైదరాబాద్ శ్రీరాములు థియేటర్ లో లాంచ్ చేయబోతున్నారు.

తాజాగా ఈ సినిమా నైజాం, వైజాగ్ హక్కులను ఎస్విసి డిస్ట్రిబ్యూషన్ ద్వారా దిల్ రాజు సొంతం చేసుకున్నారట. సో స్క్రీన్ల పరంగా ఎలాంటి టెన్షన్ ఉండబోవడం లేదు. మే 20కి ముందు పెద్దగా చెప్పుకునే సినిమాలేవీ లేవు. ఆ వారంలో అన్నీ మంచి శకునములే, సామజవరగమన, బిచ్చగాడు 2 ఉన్నాయి. వీటి మీద భారీ బజ్ లేదు. టాక్ బాగా వస్తే నిలదొక్కుకుంటాయి. వందల థియేటర్లలో రిలీజ్ చేయడం లాంటివి ఉండవు కాబట్టి సింహాద్రిని బాగా హోల్డ్ చేసుకోవచ్చు. అందులోనూ దిల్ రాజు అండ ఉంటే రెండు ప్రాంతాల్లో క్వాలిటీ స్క్రీన్లు పడతాయి కాబట్టి వసూళ్లు గట్టిగా వస్తాయి.

రాజమౌళి రెండో సినిమా, జూనియర్ కి స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీగా సింహాద్రి మీద ఫ్యాన్స్ కి మంచి ఎమోషన్ ఉంది. మాస్ ఎలివేషన్ల పరంగా జక్కన్న బెస్ట్ ని ఇందులోనే చూడొచ్చు. ఫ్లాష్ బ్యాక్ లో కేరళ ఎపిసోడ్, సింగమలైగా చేసిన యాక్షన్ సీన్స్ అన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయి. ఇక కీరవాణి సంగీతం సరేసరి. తెల్లవారుఝామున అయిదు గంటల నుంచే స్పెషల్ షోలు ప్లాన్ చేయబోతున్నారని సమాచారం. ఇలా ఇప్పటిదాకా దేనికీ జరగలేదు. ఆరెంజ్ లాంటి డిజాస్టరే ఆ స్థాయిలో వసూళ్లు తేగా లేనిది దిల్ రాజు అండ దక్కిన ఇండస్ట్రీ హిట్ సింహాద్రి ఇంకెంత సెన్సేషన్ చేస్తుందో.