ప్రభాస్ సినిమాకు ఖరీదైన జిరాక్స్

బాలీవుడ్ డెబ్యూ కోసం ఏరికోరి మరీ ఛత్రపతి హిందీ రీమేక్ ఎంచుకున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఈ నెల 12న థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. దాదాపు మూడేళ్లు దీనికోసమే తెలుగు సినిమాకు దూరంగా ఉన్న ఈ కుర్ర హీరో ఇది కనక హిట్ అయితే నెక్స్ట్ చేయబోయేవి ప్యాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 లాంటి రీమేకులను బాగా డీల్ చేసిన వివి వినాయక్ ని దర్శకుడిగా సెట్ చేసుకుంది . కేవలం వేరే నిర్మాత దగ్గర ఉన్న టైటిల్ కోసమే రెండు కోట్లు ఇచ్చారనే టాక్ ఉంది.

ఇవాళ దీని ట్రైలర్ వచ్చింది. ఆద్యంతం విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ని భారీ ఎత్తున చిత్రీకరించారు. 1985 పాకిస్థాన్ నుంచి వలసవచ్చిన కుటుంబం కథను మొదలుపెట్టి అక్కడి నుంచి ఇండియాలో ఛత్రపతి పెరిగి పెద్దవ్వడం, అమ్మను దూరం చేసుకోవడం, తెలియకుండానే తమ్ముడితో శత్రుత్వం ఇవన్నీ యధాతథంగా వాడేశారు. ఇసుక తిన్నెలో ఫైట్, ఒక్క అడుగు అంటూ ఇంటర్వెల్ కు ముందు వార్నింగ్ ఇచ్చే సీన్ అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ మాత్రం రిచ్ గా ఉండటం ప్రతి ఫ్రేమ్ లో స్పష్టంగా కనిపిస్తోంది.

హీరోయిన్ నష్రత్ బరూచా గ్లామర్ గట్టిగానే ఒలకబోసినట్టు ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ శరత్ కెద్కర్ ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. తల్లిగా మైనే ప్యార్ కియా భాగ్యశ్రీ చేశారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒరిజినల్ ప్రభాస్ ఛత్రపతిని ఆన్ లైన్ లో కొన్ని కోట్ల మంది చూసేసిన తర్వాత ఇంత రిస్క్ చేసి తన డెబ్యూకి సాయి శ్రీనివాస్ ఎంచుకోవడం సాహసమే. పైగా పెన్ బ్యానర్ ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడలేదు. అన్నట్టు షూటింగ్ కు ముందు తెలుగులో డబ్ చేస్తామని యూనిట్ చెప్పింది కానీ ఇప్పుడా ఆలోచనను విరమించుకున్నారు. లేనిపోని పోలికలతో ట్రోలింగ్ ప్రమాదం ఉంటుంది కదా.