దత్తుగారి మాటలు అంత దూరం వెళ్తాయా

కొన్నిసార్లు తెలిసో తెలియకో యథాలాపంగా అనేసిన మాటలు చాలా దూరం వెళ్లిపోతాయి. మొన్న రజనీకాంత్ తనను అతిథిగా పిలిచారన్న గౌరవంతో ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు గురించి ఓ నాలుగు ముక్కలు మాట్లాడితే దాని వైసిపి వాళ్ళు వాడకూడని భాషలో ఎదురుదాడి చేసి అవసరం లేని రచ్చని మొదలుపెట్టారు. ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయి ఏకంగా తలైవాకు సదరు మంత్రులు ప్రతినిధులు క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేసే దాకా వెళ్లాయి. ఇదింకా పచ్చిగా ఉండగానే అగ్ర నిర్మాత సి అశ్వినిదత్ గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.

మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మోసగాళ్లకు మోసగాడుని 4కెలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో నంది పురస్కారాల టాపిక్ మీద అశ్వినీదత్ మాట్లాడుతూ ఇప్పుడు ఉత్తమ రౌడీ ఉత్తమ గూండా అవార్డులు ఇస్తున్నారని, సినిమా వాళ్ళు కోరుకునేవి త్వరలో వస్తాయని అన్నారు. నిజానికి ఆయన ఉద్దేశం ఏదైనా అవి నేరుగా వైసిపి వాళ్ళు తమకు అన్వయించేసుకుని మళ్ళీ కౌంటర్ల పర్వం మొదలుపెట్టారు. ముందు పోసాని కృష్ణమురళితో ఇది మొదలయ్యింది. భుజాలు తడుముకుని ఇంకెవరు వస్తారో వేచి చూడాలి.

నిజంగానే వాళ్ళు పర్సనల్ గా తీసుకుంటే దత్తుగారి బ్యానర్లో రూపొంది వచ్చే ఏడాది జనవరి 12 విడుదల కాబోయే ప్రాజెక్ట్ కె మీద ఎఫెక్ట్ పడుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే అప్పటికింతా ఎన్నికలు జరిగి ఉండవు. భీమ్లా నాయక్ టైంలో జరిగిన పరిణామాలు వాళ్లకు తెలిసిందే. ఒకవేళ అప్పటికప్పుడు టికెట్ రేట్లు నియంత్రణ, అదనపు షోల అడ్డగింత లాంటివి జరుగుతాయేమోనని వాళ్ళ ఆందోళన. ఒకవేళ రిలీజ్ డేట్ మారకపోతే సంక్రాంతికి ఎంత లేదన్నా మరో రెండు పెద్ద సినిమాలు ఉంటాయి. అన్నింటిని ఇబ్బంది పెట్టలేరుగా. అందుకే దత్తు గారి మాటలు అంత నష్టం చేయవనే అనుకోవచ్చు