‘విరూపాక్ష’ క్లైమాక్స్‌కు సుకుమార్ ట్విస్ట్

టాలీవుడ్లో ఇప్పుడు రాజమౌళి తర్వాత ఎక్కువ హవా నడిపిస్తున్న దర్శకుడు సుకుమారే. రాజమౌళిలా భారీ కాన్వాస్‌లో సినిమాలు తీయడు కానీ.. సగటు కమర్షియల్ సినిమాల్లోనే తన మార్కు బ్రిలియన్స్ చూపిస్తూ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాడు ఈ లెక్కల మాస్టారు. రంగస్థలం, పుష్ప చిత్రాలతో దర్శకుడిగా తన స్థాయిని ఎంతగానో పెంచుకున్న ఆయన.. తన దగ్గర శిష్యరికం చేసే అసిస్టెంట్లకు మార్గనిర్దేశం చేస్తూ, కథా సహకారం అందిస్తూ, వారికి దర్శకులుగా అవకాశాలు ఇప్పిస్తూ, వేరే సంస్థల భాగస్వామ్యంలో వారి చిత్రాలను నిర్మిస్తూ ఒక గాడ్ ఫాదర్ లాగా మారారు.

ఒకప్పుడు బాలీవుడ్లో వర్మ తరహాలో ఇప్పుడు టాలీవుడ్లో ఒక పెద్ద వ్యవస్థలా మారాడు సుక్కు. తాజాగా ఆయన తన శిష్యుడు కార్తీక్ దండు బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్నందుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అతను రూపొందించిన ‘విరూపాక్ష’కు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడమే కాదు, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు.

ఈ సినిమా కథ నచ్చి తనే స్క్రీన్ ప్లే రాస్తానని సుకుమార్ ముందుకు వచ్చినట్లు కార్తీక్ మీడియా ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు. ఈ సినిమాకు సుకుమార్ ఏకంగా ఆరు వెర్షన్లు రాస్తే.. అందులో ది బెస్ట్ అనదగ్గది ఎంచుకున్నట్లు కార్తీక్ వెల్లడించాడు. విశేషం ఏంటంటే.. ‘విరూపాక్ష’ క్లైమాక్స్ క్రెడిట్ మొత్తం సుకుమార్‌దే అని కార్తీక్ చెప్పడం. ఈ సినిమాలో విలన్ ఎవరనే విషయంలో తాను ఒక రకమైన ట్విస్టు ఇస్తే.. సుకుమార్ మొత్తం క్లైమాక్స్ మార్చేసి వేరే వ్యక్తిని విలన్‌గా చూపించారని.. తనతో పాటు టీంలో అందరికీ ఆ ట్విస్టే నచ్చి దాన్నే ఓకే చేశామని కార్తీక్ వెల్లడించాడు.

ఇక్కడ విలన్ ఎవరన్నది చెబితే.. సినిమా చూడని వాళ్లకు థ్రిల్ మిస్సవుతారు కాబట్టి చెప్పట్లేదు కానీ.. సినిమా చూసిన వాళ్లు మాత్రం ఆ ట్విస్టు చూసి షాకవ్వడం ఖాయం. తెలుగు సినిమాల్లో ఇలాంటి ట్విస్టు అరుదుగా ఉంటుంది. మన ప్రేక్షకుల అభిరుచి మీద నమ్మకంతో ఇలాంటి ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్‌ను కొనియాడకుండా ఉండలేం.