మైత్రి విడుదల – పుష్ప హ్యాపీ

ఇండస్ట్రీలో విపరీతమైన చర్చకు దారి తీసిన ఆదాయపు పన్ను అధికారుల దాడులు ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులతో పాటు దర్శకుడు సుకుమార్ ని  లక్ష్యంగా పెట్టుకున్న ఈ రైడ్స్ లో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగలేదని నిర్ధారణకు వచ్చారట. ఇవి అధికారికంగా చెప్పే వ్యవహారాలు కాదు కాబట్టి ఆ మేరకు ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ ఐటి ఆఫీసర్ల నుంచి కానీ ఎలాంటి మీడియా నోట్ రాకపోవచ్చు. వీటి వెనుక ఏపీకి చెందిన ఒంగోలు మంత్రి బాలినేని ప్రమేయం ఉన్నట్టు వార్తలు వచ్చాయి కానీ వాటిని కొట్టిపారేస్తూ ఆయన స్టేట్ మెంట్ ఇచ్చేశారు.

ఈ పరిణామాల వల్ల షూటింగ్ వాయిదా పడిన పుష్ప 2 ది రూల్ మళ్ళీ పునఃప్రారంభం కానుంది. మంచి స్వింగ్ లో ఉన్నప్పుడు ఇలా జరగడంతో యూనిట్ బాగా డిస్ట్రబ్ అయ్యింది. వాయిదా వల్ల బడ్జెట్ భారం పెరిగినా కూడా తప్పని పరిస్థితుల్లో ప్యాకప్ చెప్పారు. అనుకోకుండా బ్రేక్ దక్కడంతో బన్నీ ఇటీవలే ఉపాసన శ్రీమంతం పార్టీకి హాజరై చరణ్ తో దిగిన ఫోటోలు వీడియోల్లో కనిపించాడు. మైత్రికి సంబంధించిన పెట్టుబడుల్లో ఎలాంటి అనైతికత లేదని నిర్ధారించుకున్నాకే వదిలేసినట్టు వినికిడి. మరికొద్ది రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది

ఇప్పుడు కూల్ గా అయిపోయినా మిగిలిన నిర్మాణ సంస్థలకూ ఇదొక హెచ్చరిక లాంటిది. ఫ్యాన్స్ ని ఆడియన్స్ కి ఆకట్టుకోవడం కోసం ప్రమోషన్లలో భాగంగా వందల కోట్లు వసూలయ్యాయని  పోస్టర్లలో పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం లేదా ఈవెంట్లలో మాట్లాడ్డం వల్ల ఇలాంటి చిక్కులు వచ్చే ప్రమాదం లేకపోలేదు. అయినా ఇంత భారీ పెట్టుబడులు సినిమాలు తీస్తున్న నిర్మాతలు ఇవన్నీ ఊహించలేక  గుడ్డిగా వెళ్లడం లేదు. తగినన్ని జాగ్రత్తలతో సిఏలతో ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయిస్తూ పద్ధతి ప్రకారమే ఉంటారు. ఏదైనా తేడా వస్తే కలిగే ఇబ్బందులు కోట్ల నష్టాన్ని తీసుకొస్తాయి