రాజమౌళిని విడిచిపెట్టని మణిరత్నం

వెటరన్ క్లాసిక్ డైరెక్టర్ గా పేరున్న మణిరత్నం గురించి తెలియని వారు ఉండరు. సౌత్ సినిమా గర్వంగా చెప్పుకునే క్లాసిక్స్ లో ఈయన తీసిన వాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. నాయకుడు, గీతాంజలి, ఘర్షణ, దళపతి, రోజా, బొంబాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఆణిముత్యాలు కళ్ళముందు మెదులుతాయి. అయితే గత కొంత కాలంతో తన మేజిక్ టచ్ కోల్పోయిన మణిరత్నం వరసగా కడలి, చెలియా, నవాబ్ లాంటి తన స్థాయి కాని ఫ్లాపులను ఇచ్చారు. ఓకే బంగారం లాంటివి ఆడాయి కానీ మరీ గొప్పగా చెప్పుకునే రేంజ్ లో మాత్రం కాదు

పొన్నియిన్ సెల్వన్ వచ్చాకే మణిరత్నం మీద నమ్మకం కుదిరింది. బయట భాషల్లో తేడా జరిగింది కానీ తమిళంలో మాత్రం మొదటి భాగం ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన మాట వాస్తవం. ఇంత విఖ్యాత దర్శకుడు సైతం సందర్భం వచ్చిన ప్రతిసారి జక్కన్న ప్రస్తావన తేకుండా ఉండలేకపోతున్నారు.

నిన్న హైదరాబాద్ లో జరిగిన పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ రాజమౌళి కనక బాహుబలి రెండు భాగాల్లో తీసి ఉండకపోతే తనకు అసలు ఈ పీఎస్ చేయాలన్న సాహసోపేతమైన ఆలోచన వచ్చేది కాదని పబ్లిక్ స్టేజి మీద మరోసారి నిజాయితీగా ఒప్పేసుకున్నారు.

కెరీర్ పరంగా పోల్చుకుంటే రాజమౌళి ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టుకునే నాటికే మణిరత్నంకు చాలా గొప్ప పేరుంది. టాప్ ఫిలిం మేకర్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తే స్వయంగా జక్కన్న స్ఫూర్తి అని చెప్పడం కన్నా ఇంకేం కావాలి.

తెలుగు రాష్ట్రాల్లో తగినంత బజ్ లేక ఇబ్బంది పడుతున్న పొన్నియిన్ సెల్వన్ 2కి అదే రోజు వస్తున్న అఖిల్ ఏజెంట్ పెద్ద సవాల్ విసురుతోంది. అందుకే అంచనాలు పెంచే క్రమంలో పీఎస్ 2 టీమ్ మొత్తం భాగ్యనగరానికి విచ్చేసింది. ఉదయం ఆట టాక్ వచ్చే దాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు