ఇదిరా సుకుమార్ బ్రాండు

సుకుమార్ శిష్యుల గురించి ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చే నడుస్తోంది. కొన్ని నెలల వ్యవధిలో ముగ్గురు సుకుమార్ అసిస్టెంట్లు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టడమే ఇందుక్కారణం. గత ఏడాది చివర్లో పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన ‘18 పేజెస్’ డివైడ్ టాక్‌తోనే మంచి విజయం సాధించింది.

థియేటర్ల దగ్గర సక్సెస్ ఫుల్‌ ఫిలింగా నిలిచిన ఈ చిత్రం.. తర్వాత ఓటీటీలో రిలీజై అక్కడా మంచి స్పందన తెచ్చుకుంది. సుకుమార్‌కు అత్యంత ఇష్టమైన శిష్యుల్లో ఒకడైన సూర్యప్రతాప్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. దీనికంటే ముందు సుకుమార్ కథతోనే అతను ‘కుమారి 21 ఎఫ్’ తీసి పెద్ద హిట్ కొట్టాడు.

ఇక గత నెల చివర్లో వచ్చిన నాని సినిమా ‘దసరా’ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించాడు. సుకుమార్ బ్రాండు అంటే ఎలా ఉంటుందో అతను బలంగా చాటి చెప్పాడు. దీంతో ఇంకో మూడు వారాలు తిరిగేసరికి మరో సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు డెబ్యూకు రెడీ అవడంతో అతడి మీదికి అందరి దృష్టీ మళ్లింది.

కార్తీక్ రూపొందించిన తొలి చిత్రం ‘విరూపాక్ష’ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్లలో ఒకటిగా ‘విరూపాక్ష’ పేరు తెచ్చుకుంటోంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వేగంగా స్ప్రెడ్ అయి.. సాయంత్రానికి హౌస్ ఫుల్స్ పడిపోయాయి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ‘విరూపాక్ష’ డైరెక్టర్స్ ఫిలిం అనడంలో సందేహం లేదు. కథ, టేకింగే ఈ సినిమాకు పెద్ద బలాలు.

ఎక్కడా బిగి సడలకుండా ఈ సినిమాను కార్తీక్ తీర్చిదిద్దిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులను మొదట్నుంచి చివరి వరకు గెస్సింగ్‌లో ఉంచడం.. ఎక్కడా ఆసక్తి కోల్పోకుండా చేయడం.. స్టన్నింగ్ ట్విస్టులతో ఆశ్చర్యపరచడం ద్వారా కార్తీక్ తన ముద్రను చాటాడు. సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయింది. నాలుగు నెలల వ్యవధిలో సుకుమార్ శిష్యులు మూడో సక్సెస్ అందుకోవడంతో ఇటు నిర్మాతల్లో, అటు ప్రేక్షకుల్లో ఆయన మీద, తన శిష్యుల మీద బాగా నమ్మకం పెరిగిపోయింది. సుక్కు బ్రాండ్ మరింత బలోపేతం అయింది.