ఏజెంట్ బృందానికి ఊహించని షాక్

అఖిల్ ఏజెంట్ కోసం ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. రేపు వరంగల్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా ప్రభాస్ రావడం ఖాయమే కానీ యూనిట్ దాన్ని అధికారికంగా ధృవీకరించడం లేదు. రామ్ చరణ్ వచ్చే ఛాన్స్ ఉందంటూ మరో ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన మమ్ముట్టిని ప్రమోషన్లలో భాగం చేసేందుకు టీమ్ సన్నద్ధంగా ఉన్న టైంలో ఊహించని షాక్ తగిలింది. మలయాళం మెగాస్టార్ తల్లి ఫాతిమా ఇస్మాయిల్ అనారోగ్యంతో నిన్న తుది శ్వాస తీసుకున్నారు

దీంతో మమ్ముట్టి రేపు అందుబాటులోకి రావడం దాదాపు అసాధ్యం. డేట్ల సమస్య వల్ల కాకినాడలో జరిగిన ట్రైలర్ లాంచ్ మిస్ అయ్యారు. ఇప్పుడు మరోసారి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆవిడ వయసు 93 సంవత్సరాలు. అయిదుగురు పిల్లల్లో మమ్ముట్టి ఒకరు. కొడుకు, మనవడు దుల్కర్ సినీ ప్రస్థానాన్ని కళ్లారా చూసుకుని సెలవు తీసుకున్నారు. ఏజెంట్ హీరో అఖిలే అయినా కేరళలో మార్కెట్ చేయడానికి మమ్ముట్టి హాజరు చాలా కీలకం. అక్కడి అభిమానులు ఏజెంట్ కి మంచి పబ్లిసిటీ ఇవ్వడానికి కారణం ఇదే. అలాంటప్పుడు మమ్ముట్టి లేకుండా ప్రచారం చేయడం కష్టం.

ఇలాంటి ఊహించని అవాంతరాలు ఏజెంట్ ను ముందు నుంచి వెంటాడుతూనే ఉన్నాయి. ట్రైలర్ లో సగం వరకే మమ్ముట్టి స్వంత గొంతు ఉంది. ఆ తర్వాత వేరే వాయిస్ ఉంది. అంటే ఇంకా డబ్బింగ్ పూర్తి కాలేదని అర్థమైపోయింది. సెన్సార్ చేయించారు కానీ సినిమాలో ఎవరి గొంతు పూర్తిగా వినిపిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా ఏప్రిల్ 28 ఏజెంట్ తో పాటు విడుదల కాబోతున్న పొన్నియిన్ సెల్వం 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అదే టైంలో హైదరాబాద్ లో చేయబోతున్నారు. మొత్తానికి రెండింటి మధ్య క్లాష్ నువ్వా నేనా అనేలా ఉంది కానీ ఏజెంట్ మీదున్న ఆసక్తిలో పీఎస్ 2 మీద సగం కూడా లేదన్నది వాస్తవం