పూజా హెగ్డే ఆశలకు అగ్నిపరీక్ష

గత ఏడాది వరస డిజాస్టర్లతో ఉక్కిరి బిక్కిరైన పూజా హెగ్డే కొత్త సంవత్సరంలో కిసీకా భాయ్ కిసీకా జాన్ హిట్ తో తొలిబోణీ జరగాలని కోరుకుంటోంది. 2022లో రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య ఇవేవి హిట్ అనిపించుకోలేకపోయాయి. హిందీలో రణ్వీర్ సింగ్ తో చేసిన సర్కస్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఫలితాల్లో తన ప్రమేయం లేకపోయినా అవన్నీ పెద్ద పెద్ద స్టార్ హీరోలతో చేసినవి కావడం వల్ల ఎంత లేదన్నా సక్సెస్ రాలేదనే బాధ ఉంటుంది. అందుకే సరిజోడి, వయసు ఇవేవి చూసుకోకుండా సల్మాన్ ఖాన్ లాంటి సీనియర్ హీరోతో జట్టు కట్టేందుకు సిద్ధపడింది.

తీరా చూస్తే కిసీకా భాయ్ కిసీకా జాన్ కు బాలీవుడ్ లోనూ ఏమంత హైప్ కనిపించడం లేదు. సాధారణంగా కండల వీరుడి సినిమా రంజాన్ పండక్కు వస్తుందంటే ఓ రేంజ్ లో హడావిడి జరుగుతుంది. ముస్లింలతో పాటు ఇతర మతాలకు చెందిన అభిమానులు మొదటి రోజు చూసేందుకు ఎగబడతారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ దానికి తగ్గట్టు లేవు. పరిస్థితి ఎలా ఉందంటే భోళా, తూ ఝూటి మై మక్కర్ లాంటి సల్లు భాయ్ స్థాయి సినిమాలు కానివాటితో భాయ్ జాన్ ని పోలుస్తున్నారు విశ్లేషకులు. రేపు తేడా ఏమైనా వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద పడే దెబ్బ మాములుగా ఉండదు.

ఇప్పటిదాకా ఈ సినిమాకు చేసిన ప్రమోషన్ ఏ మాత్రం హైప్ ని తీసుకురాలేదు. వెంకటేష్ కీలక పాత్ర పోషించిన విషయాన్ని తెలుగు మార్కెట్ లో వాడుకోలేదు. పూజా హెగ్డే గ్లామర్ ని గుంపులో కలిపేశారు. పాటలు ట్రోలింగ్ కి దారిచ్చాయి. నిన్న వదిలిన లుంగీ పాట మరీ అన్యాయంగా కామెంట్లకు గురయ్యింది. పిల్లల రైమ్స్ ని తీసుకుని ఖంగాళీగా ఉన్న ఈ సాంగ్ లో కండల వీరుడి స్టెప్పులు దారుణంగా ఉన్నాయి. పఠాన్ లో కనీసం సగమైనా వసూలు చేస్తుందని అసలు పెట్టుకున్న సల్మాన్ ఫ్యాన్స్ రేపటి కోసం ఎదురు చూస్తున్నారు. అజిత్ వీరం రీమేకనే ప్రచారం ఆసక్తిని తగ్గిస్తోంది.