మాస్ డైరెక్టర్‌ని నమ్ముకున్న తేజు

తొలి చిత్రం ‘రేయ్’ సంగతి పక్కన పెడితే.. కెరీర్ ఆరంభంలో సాయిధరమ్ తేజ్ వరుస విజయాలతో దూసుకెళ్లాడు. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సూపర్ సక్సెస్ అయి అతణ్ని హ్యాట్రిక్ హీరోను చేశాయి. కానీ తర్వాత వరుస పరాజయాలతో అతను సతమతం అయ్యాడు. అరడజను ఫ్లాపుల తర్వాత ‘చిత్రలహరి’తో కాస్త పుంజుకుని.. ‘ప్రతి రోజూ పండగే’తో మళ్లీ ట్రాక్ ఎక్కినట్లే కనిపించాడు.

కానీ ఆ తర్వాత కూడా తడబాటు తప్పట్లేదు. సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్ సినిమాలు తేడా కొట్టేశాయి. ఇప్పుడు ‘విరూపాక్ష’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మెగాస్టార్ మేనల్లుడు. ఈ సినిమా ప్రోమోలు బాగున్నప్పటికీ.. తేజు ట్రాక్ రికార్డు బాగా లేకపోవడం వల్ల హైప్ క్రియేట్ అవ్వలేదు. ఎంతైనా ఇది థ్రిల్లర్ మూవీ కాబట్టి.. టాక్ బాగున్నా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం దక్కడం సందేహమే.

ఎంతైనా స్టార్ ఇమేజ్ ఉన్న హీరో మాస్ సినిమా చేస్తేనే సినిమాలకు హైప్ వస్తుంది. ఫ్యాన్స్ సంతృప్తి చెందుతారు. అందుకే తేజు.. ఆ దిశగా ఒక అడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అతను మాస్ సినిమాలకు పెట్టింది పేరైన సంపత్ నందితో జట్టు కడుతున్నట్లు సమాచారం. ‘ఏమైంది ఈవేళ’ లాంటి లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయం అయినప్పటికీ.. ఆ తర్వాత రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సీటీమార్ లాంటి మాస్ టచ్ ఉన్న సినిమాలే చేశాడు సంపత్.

‘సీటీమార్’ తర్వాత అతను కొంచెం గ్యాప్ తీసుకుని.. ఇప్పుడు తేజుతో సినిమాను ఓకే చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కనుందట. తేజు, సంపత్ నంది కలిశారంటే.. ‘రచ్చ’ తరహాలో పక్కా మాస్ సినిమానే వచ్చే అవకాశముంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.