లండన్ వెళ్ళగానే అన్నీ మటుమాయం

శాకుంతలం డిజాస్టర్ దెబ్బకు మౌన వ్రతం వహించిన సమంతా సినిమా మొదటి వారం పూర్తి చేసుకోకుండానే లండన్ వెళ్లిపోయింది. ఇక్కడ నష్టాల లెక్కలో నిర్మాతలు దిల్ రాజు, గుణశేఖర్ లు బిజీగా ఉండగా తను మాత్రం ఇన్స్ టాలో భగవద్గీత శ్లోకం పెట్టేసి సెలవు తీసుకుంది. కారణం సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ప్రీమియర్ షోకు హాజరు కావడం. దీని హిందీ రీమేక్ లో సామ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా చేసిన క్యారెక్టర్ ఇది. ఈ ఈవెంట్ కి విచ్చేసిన సామ్ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో మంచి స్టిల్స్ కూడా ఇచ్చింది.

ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారణం ఉంది. హైదరాబాద్ లో ఉన్నన్నాళ్ళు కంటి అద్దాలు పెట్టుకుని, జ్వరంతో బాధపడుతూ చాలా ఇబ్బంది పడ్డట్టు కనిపించిన సామ్ రిలీజ్ కు రెండు రోజుల ముందే జ్వరమని చెప్పి మీడియాకు సైతం దూరంగా ఉంది. యాంకర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఛష్మాలు తీయలేదు. ఇప్పుడు విదేశాలకు వెళ్ళగానే అవి కాస్తా మాయమైపోయాయి. మొహంలో ఛార్మ్ కనిపిస్తోంది. యశోద, శాకుంతలం విడుదల సమయంలో సానుభూతి కోసమే ఇక్కడ డల్ గా కనిపించిందన్న కామెంట్స్ కి ఇప్పుడీ పిక్స్ బలం చేకూరుస్తున్నాయి.

దీనికి సంబంధించి నిజా నిజాలు తనకే తెలుసు కానీ నెటిజెన్లకు అవన్నీ అక్కర్లేదుగా. సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని నిలదీస్తారు. కనీసం ఓ ఆరేడు కోట్ల షేర్ కూడా వసూలు చేయనంత దారుణంగా శాకుంతలం ఫ్లాప్ కావడం ఎవరూ ఊహించనిది. ఒకవేళ హిట్ అయ్యుంటే ఇప్పుడు సమంతా లండన్ వెళ్లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం. అన్నట్టు 14 ఏప్రిల్ తర్వాత అమ్మడు ట్విట్టర్ లోనూ లేదు. ఫారిన్ ట్రిప్ గురించి కానీ సిటాడెల్ అప్డేట్ కానీ ఏదీ ఇవ్వలేదు. బహుశా నెగటివ్ ప్రచారం తాలూకు వేసవి సెగలు గట్టిగానే తగిలినట్టు ఉన్నాయి.