ప‌వ‌న్ సినిమా రీమేక్ కాద‌ట‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస‌గా రీమేక్ సినిమాలు చేస్తుండ‌టం ప‌ట్ల అభిమానుల్లో వ్య‌తిరేక‌త నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న రీఎంట్రీ మూవీ వ‌కీల్ సాబ్ రీమేకే. దాని త‌ర్వాత వ‌చ్చిన భీమ్లా నాయ‌క్ సైతం రీమేకే. ఇప్పుడు ప‌వ‌న్ నుంచి రిలీజ్ కానున్న కొత్త చిత్రం కూడా రీమేకే అన్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన వినోదియ సిత్తం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం విదిత‌మే. ఒరిజిన‌ల్ తీసిన స‌ముద్ర ఖ‌నినే తెలుగులోనూ డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం జులైలో విడుద‌ల కాబోతోంది.

ఐతే ఈ సినిమా పేరుకే రీమేక్ అని.. మాతృక‌తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంద‌ని.. రీమేక్ లాగా అనిపించ‌ద‌ని అంటున్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్. త‌న మావ‌య్య ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి తాను చేస్తున్న సినిమాకు.. దాని మాతృక‌కు అస‌లు సంబంధం ఉండ‌ద‌ని తేజు సింపుల్‌గా తేల్చేశాడు. మాతృక‌లోని సోల్ మాత్ర‌మే తీసుకుని.. మిగ‌తా సినిమా అంతా మార్చేశార‌ని.. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా మార్పులు చేర్పులు చాలా జ‌రిగాయ‌ని తేజు తెలిపాడు.

త‌న మావ‌య్య‌తో క‌లిసి న‌టిస్తున్న సినిమాకు రీమేక్‌ను ఎంచుకోవ‌డంపై అభిమానులు చాలామంది అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశార‌ని.. కానీ రీమేకా ఇంకోటా అన్న‌ది ప‌క్క‌న పెడితే త‌న‌ను చిన్న‌ప్ప‌ట్నుంచి పెంచి పెద్ద చేసిన వ్య‌క్తితో క‌లిసి న‌టించ‌డం అన్న‌ది త‌న‌కు గొప్ప అనుభ‌వ‌మ‌ని తేజు తెలిపాడు. మావ‌య్య‌తో న‌టించ‌డం త‌న డ్రీమ్ కాబ‌ట్టి ఏ క‌థ‌, ఎలాంటి సినిమా అన్న‌ది ప‌ట్టించుకోన‌ని.. ఆ అవ‌కాశం వ‌స్తే ఎలా వ‌దులుకుంటాన‌ని తేజు అన్నాడు. ఇక త‌న పెళ్లి గురించి వ‌చ్చే రూమ‌ర్ల‌పై తేజు స్పందిస్తూ.. వెబ్ సైట్ల‌లో, సోష‌ల్ మీడియాలో ఇలా విప‌రీతంగా ప్ర‌చారం జ‌ర‌గ‌డం వ‌ల్లే త‌న పెళ్లి జ‌ర‌గ‌ట్లేద‌ని చ‌మ‌త్క‌రించాడు.