వసూళ్ల విషాదంలో శాకుంతలం బృందం

ఎపిక్ డిజాస్టర్ అనే మాట చిన్నదనిపిస్తోంది శాకుంతలం పరిస్థితి చూస్తుంటే. మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ తో వసూళ్ల పరంగా రోజు రోజుకి తీసికట్టుగా మారిపోవడంతో దిల్ రాజు, గుణశేఖర్ బృందాలు ఒక్కసారిగా మౌనం వహించాయి. ఎంత ఫ్లాప్ అయినా సరే మాములుగా దర్శక నిర్మాతలు మొదటిరోజు బాణాసంచాతో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం, వీకెండ్ ఫుల్ కోసం ప్రెస్ మీట్ పెట్టి కాసిన్ని మాటలు చెప్పి ఏదోలా జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం సహజం. కానీ శాకుంతలం టీమ్ మాత్రం మొదటి రోజు సాయంత్రం నుంచే అందుబాటులో లేకుండా పోయింది.

ట్రేడ్ టాక్ ప్రకారం ఇప్పటిదాకా మూడు రోజులకు గాను వసూలైన గ్రాస్ కేవలం ఏడున్నర కోట్లేనట. అంటే షేర్ మూడు కోట్ల అరవై లక్షల దాకా తేలుతుంది. ఇది చాలా తక్కువ మొత్తం. థియేట్రికల్ బిజినెస్ 18 కోట్లకు అమ్మారు. ఇప్పుడిందులో సగం రావడం కూడా అసాధ్యమే. బడ్జెట్ 80 కోట్ల దాకా అయ్యిందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కాబట్టి ఆ కోణంలో చూసుకుని నష్టం లెక్క వేసుకుంటే ఒంట్లో వణుకు పుట్టుకొస్తుంది. ఇంకా శాటిలైట్ అమ్ముడుపోలేదు. ఓటిటికి ఇచ్చినట్టు లేరు. ఒకవేళ ముందస్తు అగ్రిమెంట్ అయ్యుంటే టైటిల్ కార్డులో వచ్చేది. ఇప్పుడు ఎవరు కొన్నా తక్కువ మొత్తం వస్తుంది.

రెండో వారంలో థియేటర్లను హోల్డ్ చేసి పెట్టుకున్నా లాభం లేనట్టుగా మారిపోయింది పరిస్థితి. అద్దెలు గిట్టుబాటు అయినా గొప్పే అనుకోవాలి. కానీ ఆ ఛాన్స్ సైతం కనిపించడం లేదు. మొదటిరోజు దేవి 70 ఎంఎం దగ్గర కనిపించిన గుణశేఖర్, నీలిమ గుణలు మళ్ళీ దర్శనమిస్తే ఒట్టు. సమంతా సైతం ట్విట్టర్ లో మౌనంగా ఉంది. యునానిమస్ గా సినిమా తిరస్కారానికి గురి కావడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. గత ఏడాది రిలీజైన వాటిలో టాప్ డిజాస్టర్స్ గా నిలిచిన ఆచార్య, లైగర్ లను దాటే స్థాయిలో శాకుంతలం బయ్యర్లను భయపెట్టే స్టేజికి రావడం విషాదం.